అధికార పీఠంపై రెండే రెండు సామాజిక వర్గాలకు అవకాశం వుండాలి. ఇంకెవరూ అటువైపు కన్నెత్తి చూడకూడదు. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చెయ్యాలి.. నామినేటెడ్ పదవుల పేరుతో ఇతర సామాజిక వర్గాల్ని తాత్కాలిక ప్రలోభాలకు గురిచేసి, ఆ సామాజిక వర్గాలు అధికార పీఠం వైపు చూడకుండా జాగ్రత్త పడాలి.. ఇదీ ఆ రెండు సామాజిక వర్గాల రాజకీయ ఎత్తుగడ.
గడచిన కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న రాజకీయ నాటకమిది. తెలుగునాట, అందునా.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ కుల జాడ్యం మరీ ఎక్కువైపోయింది. ఎక్కడో హైద్రాబాద్లో వుండి, తెలంగాణకి చెందిన వ్యక్తులు సైతం.. ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో కులాల కుంపట్లను ఎగదోస్తుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
ఆర్కే మార్కు రాజకీయ విశ్లేషణ ఇంకోసారి కొత్త అనుమానాలకు తెరలేపింది కులాల కుంపట్ల వ్యవహారానికి సంబంధించి. టీడీపీకి జనసేన దగ్గరవుతోందన్నది ఆ పైత్యపు రాతల సారాంశం. నిజానికి, జనసేన పార్టీకి ఆ ఉద్దేశ్యం లేదు. అయితే, 2019 ఎన్నికల్లో ఇలాంటి దుష్ప్రచారమే చేసి, జనసేన పార్టీని రాజకీయంగా దెబ్బతీసి, వైసీపీ అధికారంలోకి రావడానికి ఈ ‘బులుగు పచ్చ’ వ్యూహం పనిచేసింది.
ఈసారి వంతు టీడీపీది అవ్వాలన్నది బహుశా బులుగు పచ్చ ఆరాటం కావొచ్చు. లేకపోతే, జనసేన మీద పదే పదే టీడీపీ పంచన చేరుతోందంటూ దుష్ప్రచారం చేయడమేంటి.? గతంలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా ఇలాంటి రాజకీయ కుట్రలే నడిచాయి. టీడీపీకి లేని కులం, ఇంకో పార్టీకి లేని కులం.. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి, ఇప్పుడు జనసేన పార్టీకి ఎలా ఆపాదించగలుగుతున్నారు.?
టీడీపీ – జనసేన కలిసిపోతున్నాయని ప్రచారం చేయడం, ఆ తర్వాత వైసీపీతో జనసేనను తిట్టించడం.. ఇంకోపక్క టీడీపీతో జనసేనను తిట్టించడం. నిజానికి, తిట్టుకోవాల్సింది అధికార పక్షం, ప్రతిపక్షం కదా.? అధికారంలో వున్నోళ్ళని ప్రశ్నించాల్సిన మీడియా, కనీసం ప్రతిపక్షాన్ని కూడా ప్రశ్నించడంలేదు.. కానీ, జనసేన పార్టీ మీద విరుచుకుపడుతోంది.
ఇంతకన్నా రాజకీయాల్లో, మీడియా రంగంలో దిగజారుడుతనం ఇంకేముంటుంది.? రెండు పార్టీల నుంచీ నెలవారీ వసూళ్ళు అందుకుంటున్న మీడియా నుంచి ఇంతకు మించి ఏదో సామాజిక బాధ్యతను, నిఖార్సయిన జర్నలిజాన్నీ ఎలా ఆశించగలం.?