నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు.. పేరుతో వైఎస్ జగన్ సర్కార్ ఓ సంక్షేమ పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం విదితమే. వేల కోట్ల ఖర్చుతో కూడుకున్న వ్యవహారమిది. రాష్ట్ర బడ్జెట్ ఎంత.? ఈ సంక్షేమ పథకానికి అయ్యే ఖర్చు ఎంత.? అసలు రాష్ట్రం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎలా చేపట్టగలుగుతుంది.? ఇలా చాలా ప్రశ్నలు మొదట్లోనే తెరపైకొచ్చాయ్.
భూమిని సేకరించడం లేదా సమీకరించడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ గనుక, తక్కువ స్థలంలో బహుళ అంతస్తుల భవనాలు.. అంటే అపార్టుమెంట్లు కట్టించి పేదలకు ఇవ్వడం ద్వారా భూమి లభ్యత సమస్యను తగ్గించవచ్చన్నది కేంద్రం యోచన.
కానీ, ఎంత ఖర్చయినా ఫర్వాలేదు, భూమిని ప్రజలకు కానుకగా ఇచ్చి, అందులో ఇళ్ళను నిర్మించి ఇవ్వాలని జగన్ సర్కార్ సంకల్పించింది. ఈ క్రమంలో పెద్దయెత్తున భూముల్ని సేకరించడమో, సమీకరించడమో చేశారు. తెరవెనుకాల జరిగిన రాజకీయ అవినీతి గురించి కొత్తగా చెప్పేదేముంది.?
ఇంకా కొన్ని చోట్ల వివాదాల కారణంగా, భూముల వ్యవహారంపై గందరగోళం వుంది. ఇంతలోనే, ఈ వ్యవహారంపై మరో పిటిషన్ దాఖలైంది.. ఇళ్ళ నిర్మాణాల్ని తక్షణం ఆపాలంటూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. తక్కువ స్థలంలో ఇళ్ళను కట్టడం, కేవలం మహిళా లబ్దిదారులకే ఇళ్ళను ఇస్తుండడం వంటివాటిపై పిటిషనర్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది.
ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ పిటిషన్ దాఖలు చేసింది టీడీపీ మద్దతుదారులన్నది వైసీపీ ఆరోపణ. కాదు, ఎటూ ఈ పథకం ముందుకు సాగే పరిస్థితి లేదు గనుక, నిధుల కొరత అంశం బయటపడకుండా వుండేందుకు, వైసీపీనే తన మద్దతుదారులతో పిటిషన్ వేయించి, పథకాన్ని ఆపేయించుకుందన్నది టీడీపీ ఎదురుదాడి సారాంశం.
దొందూ దొందే… ఇలాంటి విషయాల్లో వైసీపీ – టీడీపీ స్పష్టమైన అవగాహనతో పనిచేస్తున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఎవరో పిటిషన్లు దాఖలు చేస్తే, కోర్టులు.. ఏమీ ఆలోచించకుండా తీర్పులిచ్చేస్తాయా.? అలాగైతే, ఎన్నో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఎందుకు తిరస్కరణకు గురయినట్లు.? చాలా పిటిషన్ల విచారణ సందర్భంగా పిటిషన్ దారుల్ని న్యాయస్థానాలు హెచ్చరిస్తుంటాయన్నది ఇక్కడ ప్రస్తావనార్హం.
కోర్టుల మీద బురదచల్లి, తెరవెనుకాల తమ రాజకీయ లబ్ది నెరవేర్చుకోవడం అన్నది టీడీపీ, వైసీపీలకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడూ అదే జరుగుతోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రజలే, ఇలాంటి విషయాల్లో రాజకీయ పార్టీల కుట్ర, కుతంత్రాల్ని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.
901336 534849I consider something truly unique in this site . 345497