ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి రూపొందించిన తాజా చిత్రం స్వాతిముత్యం. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర బృందం తాజాగా హైదరాబాద్ లో ఘనంగా విజయోత్సవ వేడుకకు నిర్వహించింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ” మా సినిమాకి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ పట్ల చాలా సంతోషంగా ఉంది. సినిమా గురించి, సినిమాలో పాత్రల గురించి చాలా సహజంగా మన మధ్యలో జరిగినట్లు ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు. విమర్శకులు కూడా అన్ని పాత్రలకు ప్రాధాన్యమిస్తూ మంచి వినోదాన్ని పంచామని ప్రశంసించడం ఆనందంగా ఉంది అన్నారు.
వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. ” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను.. మళ్ళీ చెబుతున్నాను. కొత్త వారికి అవకాశం ఇవ్వడం అనేది నాగ వంశీ గారికి చిన్న విషయం అయ్యుండొచ్చు. కానీ నాకు అది చాలా పెద్ద విషయం. ఇంతమంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విడుదలకు ముందే ఈ సినిమా చూసి నవ్వుకుంటూ బయటకు వస్తారని మేం చెప్పాం. అయితే మేం ఊహించిన దానికంటే ఎక్కువగా నవ్వుకుంటూ బయటకు వస్తున్నారు. దానిని బట్టే చెప్పొచ్చు ఈ చిత్రం ఎంత పెద్ద విజయమో అన్నారు.
గణేష్ మాట్లాడుతూ.. ” ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. మా సినిమాకి ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. నటుడిగా నన్ను ప్రేక్షకులు అంగీకరించారు. ప్రతి ఒక్కరూ తెర మీద గణేష్ కనిపించలేదు, బాల అనే కుర్రాడు మాత్రమే తెర మీద కనిపించాడు అన్నప్పుడు.. నటుడిగా ఓ పది మార్కులు వేయించుకున్నాను అని చిన్న తృప్తి కలిగింది అని సంతోషం వ్యక్తం చేశాడు.
నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ.. “స్వాతి ముత్యం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. మా సినిమాకి లభిస్తున్న ఆదరణ పట్ల సంతోషంగా ఉంది. చిత్ర విడుదలకు ముందు చిరంజీవి గారు పెద్ద మనసుతో మా సినిమాకి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు స్వాతి ముత్యం, గాడ్ ఫాదర్ రెండు చిత్రాలూ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. స్వాతి ముత్యం చిత్రానికి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఈ వారాంతానికి వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది” అన్నారు.
దివ్య శ్రీపాద మాట్లాడుతూ.. “ఈ సినిమాలో శైలజ అనే పాత్ర పోషించడం సంతోషంగా ఉంది. ఇలాంటి పాత్రలు రావడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.
సురేఖా వాణి మాట్లాడుతూ.. “నన్ను చాలామంది ఎక్కువ సినిమాలు ఎందుకు చేయట్లేదు, ఇలాంటి పాత్రలు ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు. అవకాశమొస్తే ఎందుకు చేయను. దర్శకుడు లక్ష్మణ్ మొదటిసారి నన్ను కలిసి ఈ సినిమాలో నా పాత్ర గురించి నాకు చెప్పినప్పుడు.. నిజంగానే ఈ పాత్ర కోసం మొదట నన్నే అనుకున్నారా అని అడిగాను. ఎందుకంటే ఇలాంటి పాత్రలు మా వరకూ రావట్లేదు. వస్తే తప్పకుండా చేస్తాం. నేను సినిమాలు మానేశాను అని కొందరు అనుకుంటున్నారు. నేను సినిమా అమ్మాయిని, ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంటాను, నాకు ఇంతమంచి పాత్ర ఇచ్చిన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు అన్నారు.