తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో సుజనా చౌదరి సహా మొత్తం నలుగురు రాజ్యసభ సభ్యులు చేరిపోయి ఎన్నో రోజులు కాలేదు. అసలు ఇదంతా ఎలా జరిగింది.? అని తెలుగుదేశం పార్టీలో కొందరు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్ర మంత్రి పదవి పోగొట్టుకున్న వెంటనే సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీతో టచ్లోకి వెళ్ళిపోయారన్నది తాజాగా తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. అప్పటినుంచీ సుజనా చౌదరి రైట్ టైమ్ కోసం ఎదురుచూస్తూ వచ్చారు.
సుజనా చౌదరి మాత్రమే కాదు ఈ లిస్ట్లో సీఎం రమేష్, టీజీ వెంకటేష్ కూడా వున్నారట. లిస్ట్లో కొత్తగా చేరింది మాత్రం గరికపాటి మోహనరావు మాత్రమేనని తెలుస్తోంది. చంద్రబాబు తన బలవంతమ్మీద సుజనా చౌదరితో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయించడంతోనే అసలు కథ మొదలయ్యింది. ‘అప్పుడు మేం మోడీ ప్రభుత్వం నుంచి బయటకు రావడం చారిత్రక తప్పిదం’ అని సుజనా చౌదరి తాజాగా సెలవిచ్చారు.
అయితే అలా మంత్రి వర్గంలోంచి సుజనా చౌదరి బయటకు వచ్చిన వెంటనే బీజేపీ పెద్దలు సుజనా చౌదరితో టచ్లోకి వచ్చారనీ, అలా సుజనా చౌదరి ద్వారా ఆంధ్రప్రదేశ్లో ‘కోవర్టు’ రాజకీయం నడిపారనీ, కొందరు ముఖ్య నేతల్ని సుజనా చౌదరి ద్వారా టీడీపీకి దూరమయ్యేలా చేశారనీ తాజాగా ఊహాగానాలు వినవస్తున్నాయి.
సుజనా చౌదరి మీద సీబీఐ, ఈడీ విచారణలు వంటివన్నీ ఉత్తుత్తివేననీ, చంద్రబాబుకి అనుమానం రాకుండా మొత్తం కథ నడిచిందని తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరు తనకు అత్యంత సన్నిహితుడి వద్ద వాపోయిన వైనం ఆ నోటా ఈ నోటా బయటకొచ్చింది. చంద్రబాబు సహజంగా ఎవర్నీ అంత గుడ్డిగా నమ్మేరనీ, కానీ చంద్రబాబు ఈసారి సుజనా చౌదరిని నమ్మి మోసపోయారని ఆ నేత అంటున్నారట.
చంద్రబాబు కలలో కూడా ఊహించని వెన్నుపోటుగా సుజనా చౌదరి పార్టీ మారడాన్ని అభివర్ణిస్తున్నారు. సుజనా చౌదరి బీజేపీలో చేరాక కూడా టీడీపీ మరింత ఎదగాలని ఆశిస్తున్నట్లు చెప్పినా, ఇప్పుడాయన మాట మార్చేశారు. 2024లో బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా తనవంతు కృషి చేస్తానని అంటున్నారాయన. ఎంతైనా వ్యాపారవేత్త కదా.. ఎక్కడ వ్యాపారం బావుంటే, అటువైపు వెళ్ళిపోతారు. ఇప్పుడాయన చేసిందీ అదేనేమో!
