పీఆర్సీని రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ‘చలో విజయవాడ’ విజయవంతం కావడంతో సీఎం జగన్ తో డీజీపీ సవాంగ్ భేటీ అయ్యారు. అరగంటపాటు జరిగిన ఈ భేటీలో.. పోలీసు నిర్బంధాలు, ఆంక్షలు పెట్టినా ఉద్యోగుల పోరాటం విజయవంతం కావడంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఉద్యమంలో ఉద్యోగులకు పోలీసులు సహకరించారన్న విషయంపై డీజీపీని జగన్ ప్రశ్నించినట్లు సమాచారం. ఉద్యోగుల రాకను అంచనా వేయడంలో ఇంటలిజెన్స్ వ్యవస్థ విఫలమైనట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. సుమారు 4 కిలోమీటర్లు ఉన్న బీఆర్టీఎస్ రోడ్డు నిమిషాల్లో ఉద్యోగులతో నిండిపోవడంపై డీజీపీని సీఎం వివరణ అడిగినట్లు తెలిసింది.
ఇంటెలిజన్స్, నిఘా వ్యవస్థ పనితీరుపైనా ఇరువురూ చర్చించినట్లు తెలిసింది. ఉద్యోగులు మారువేషాల్లో రావడం, ముందే విజయవాడ చేరుకుని బస చేయడం జరిగిందని సీఎంకు డీజీపీ తెలిపినట్లు సమాచారం. తాము తీసుకున్న చర్యలను సీఎంకు వివరించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే విషయంపై డీజీపీకి సీఎం సూచనలు చేసినట్లు తెలుస్తోంది.