Southwest Monsoon: ఎండలతో, ఉక్కపోతలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) తీపి కబురు అందించింది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) కేరళ (Kerala) తీరాన్నా తాకొచ్చనే సంకేతాలు ఇచ్చింది. దీంతో మండే ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రజల ఎదురుచూపులు మొదలయ్యాయి. ‘మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. రుతుపవనాల రాక కోసం దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్, వాయువ్య, ఈశాన్య బంగాళాఖాతంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దీంతో రుతుపవనాలకు మార్గం సుగమమైంది’ అని పేర్కొంది.
అయితే.. ప్రైవేటు వాతావరణ శాఖ స్కైమెట్ ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతందని అంచనా వేసింది. ఇందుకు బిపర్ జాయ్ తుపాను కారణమని కూడా వెల్లడించింది. దీంతో కేరళను రుతుపవనాలు తాకే సమయం 2-3 రోజులు ఆలస్యం కావొచ్చని తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు శ్రీలంకను కూడా దాటలేదని పేర్కొంది. దీంతో మరికొన్ని రోజులు ఎండలు తప్పవని అనుకుంటున్న తరుణంలో భారత వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది.