గాయని మంగ్లీకి సంబంధించిన మైక్రోఫైనాన్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో భాగంగా పోలీసులు మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాలను పరిశీలించగా, అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. రమావత్ మధు ఖాతా నుంచి శివ చౌహాన్ ఖాతాకు మూడు సార్లు డబ్బులు జమ అయినట్లు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో రమావత్ మధు బ్యాంకు ఖాతాలను అధికారులు జప్తు చేసినట్లు సమాచారం. మైక్రోఫైనాన్స్ పథకాల పేరిట అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి, మంగ్లీతో పాటు ఆమె సోదరుడు మరియు మరికొంతమంది కలిసి కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్కు చెందిన న్యాయవాది సుబ్బారావు ఈ విషయాన్ని ఇటీవల బయటపెట్టడంతో కేసు వేగం పెరిగింది.
శివ చౌహాన్ ఖాతాలోకి మోసపూరిత డబ్బులు వచ్చినట్టు ఆధారాలు లభించడంతో, ఈ కేసులో ఆయనతో పాటు మంగ్లీపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు మంగ్లీకి ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
