ఒకరేమో ఓ ప్రముఖ మీడియా సంస్థలో సీనియర్ జర్నలిస్ట్. ఇంకొకరేమో, వామపక్ష భావజాలం వున్న పొలిటికల్ ఎనలిస్ట్. ఇద్దరూ తమ తమ రంగాల్లో ఉద్ధండులే. అయితే, సమస్య ఎక్కడొచ్చిందంటే.. సదరు సీనియర్ జర్నలిస్ట్, ఓ పార్టీకి మౌత్పీస్లా మారిపోయారు. తప్పదు మరి, ఈ రోజుల్లో మెజార్టీ మీడియా సంస్థలు ఏదో ఒక పార్టీకి మౌత్ పీస్గా వ్యవహరించకపోతే కష్టం.. అన్నట్టు తయారైంది పరిస్థితి.
అయినాగానీ, సదరు సీనియర్ జర్నలిస్ట్కి ఒకప్పుడు చాలా ఫాలోయింగ్ వుండేది. చర్చా కార్యక్రమాల్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆయన పేరు ప్రఖ్యాతులు గడించారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కారణంగా ఓ ఛానల్ నుంచి ఆయనగారు బయటకు వచ్చి, మరో ఛానల్లో చేరారో.. అప్పటినుంచి కథ మారిపోయింది. జర్నలిస్ట్గా తన సుదీర్ఘ కెరీర్లో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల్ని పణంగా పెట్టి మరీ, చంద్రబాబు మీద ‘కక్ష’ తీర్చుకుంటున్నారాయన.
నిజానికి, తెలుగుదేశం పార్టీ మీద ఇప్పుడెంత విమర్శలు చేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే, ఆల్రెడీ తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీకి ‘సరైన గౌరవమే’ ఇచ్చేశారు ఇటీవలి ఎన్నికల్లో. తెలంగాణలో ఎప్పుడో గల్లంతయిపోయిన టీడీపీ, ఆంధ్రప్రదేశ్లోనూ ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక, చంద్రబాబు విషయంలో సదరు సీనియర్ జర్నలిస్ట్గారి ఆగ్రహావేశాలపై అదే చర్చా కార్యక్రమంలో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నీళ్ళు చల్లేశారు. చంద్రబాబు హయాంలోనే పోలీసుల్ని అడ్డగోలుగా సొంత అవసరాలకు వాడేసుకున్నారన్నది సీనియర్ జర్నలిస్ట్ ఆరోపణ.
చంద్రబాబు మాత్రమే కాదు, అంతకు ముందు పాలకులూ అదే పని చేశారు.. ఇప్పుడూ అదే చేస్తున్నారన్నది సీనియర్ అనలిస్ట్ విశ్లేషణ. అధికారులకు బదిలీలుంటాయేమోగానీ.. రాజకీయ నాయకుల్లా ఉద్యోగాలు ఐదేళ్ళకోసారి పోయే పరిస్థితి వుండదు. గతంలో కాంగ్రెస్కి తగ్గట్టు పనిచేశారు.. ఆ తర్వాత టీడీపీకి తగ్గట్టు పనిచేవారు. ఇప్పుడు వైసీపీ కోసం పనిచేస్తున్నారు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్ని ఇది నిష్టుర సత్యం. అధికారుల్ని ఇక్కడ ఏమీ అనలేం.. ఎందుకంటే వారిపై పనిచేసే ఒత్తిళ్ళు అలాంటివి. రేప్పొద్దున్న మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చే పరిస్థితి వుంటే.. అప్పుడు ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేకంగా పోలీస్ ఉన్నతాధికారులు పనిచేయక తప్పదు.
