హైదరాబాద్లో సంచలనం రేపిన హిట్ అండ్ రన్ ఘటనలో సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మృతి చెందారు. మాసబ్ ట్యాంక్ ప్రాంతంలోని తన నివాసం బయట శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాడుతున్న మొయినుద్దీన్పై ఇదే కారణంతో దాడి జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సమాచారం ప్రకారం, ఖాజా మొయినుద్దీన్ ఇంటి బయటకు వచ్చిన సమయంలో వేగంగా వచ్చిన ఓ SUV ఆయనను బలంగా ఢీకొట్టి అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. తీవ్రంగా గాయపడిన మొయినుద్దీన్ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు సమాచారం.
వక్ఫ్ బోర్డు భూముల ఆక్రమణలపై మొయినుద్దీన్ గత కొంతకాలంగా న్యాయపోరాటం కొనసాగిస్తున్నారని, ఇటీవల కొన్ని భూవివాదాలపై ఆయన చురుగ్గా వ్యవహరించారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు, సహచర న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనలో ఉపయోగించిన టయోటా SUV కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాహనం కదలికలను ట్రాక్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై న్యాయవాదుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
