వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేస్తుంది వైసీపీ.. అంటూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలోనే ప్రకటించింది. తమ ఎంపీలు ఉభయ సభల్లో వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసినట్లు కూడా ప్రకటించేసుకుంది. అయితే, లోక్ సభలో ఒకలా, రాజ్య సభలో ఇంకోలా వైసీపీ వ్యవహరించిందన్న విమర్శలున్నాయి.
వైసీపీ మద్దతు, వ్యతిరేకతతో సంబంధం లేకుండా పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. ఇటీవల రాష్ట్ర పతి కూడా వక్ఫ్ సవరణ బిల్లుకి ఆమోద ముద్ర వేయడం, అదిప్పుడు చట్టంగా మారింది.
అయితే, ఆ వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా అయితే, ఫలానా బిల్లుని ఫలానా పార్టీ వ్యతిరేకిస్తున్నప్పుడు, ఏ కోణంలో దాన్ని వ్యతిరేకిస్తున్నదీ సవివరంగా వెల్లడించాల్సి వుంది.
వక్ఫ్ సవరణ చట్టం, ముస్లింల మనోభావాల్ని దెబ్బతీస్తుందన్న మాట తప్ప, వైసీపీ నుంచి మరో మాట కనిపించడంలేదు. పార్లమెంటులో కూడా వైసీపీ ఎంపీలు, ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన మాటలు పసలేకుండా పోయాయి. ముస్లిం సమాజం కూడా వైసీపీ తీరుని అస్సలు పట్టించుకోని పరిస్థితి.
నిజానికి, వక్ఫ్ సవరణ చట్టం తీసుకురావడానికి, ముస్లిం సమాజంలోనే చాలామంది పెద్ద పోరాటమే చేశారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్, వక్ఫ్ సవరణ చట్టం దిశగా అడుగులేసింది. దాంతో, వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ కోర్టును ఆశ్రయించడం పూర్తిగా సెల్ఫ్ గోల్ అనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది. బిల్లుని వ్యతిరేకించడం,
సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. వీటి ద్వారా ముస్లిం సమాజం మద్దతుని వైసీపీ పొందలేదు సరికదా, ముస్లిం సమాజంలో కూడా వైసీపీ పలచనైపోతుందన్న భావన వైసీపీలో ఓ వర్గం నాయకుల నుంచి వ్యక్తమవుతుండడం గమనార్హం.
వక్ఫ్ సవరణ చట్టం విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మీడియా ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి కూడా కనిపించడంలేదంటేనే, ఎంత గందరగోళం నడుమ వైసీపీ, వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసి, సుప్రీంకోర్టును ఆశ్రయించిందో అర్థం చేసుకోవచ్చు.