Wrestlers Protest: ఢిల్లీ (Delhi) లో భారత రెజ్లర్లు (Wrestlers) చేస్తున్న దీక్షా శిబిరం వద్ద బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు, రెజ్లర్లకు మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. దీక్షా శిబిరం వద్దకు ఎమ్మెల్యే సోమ్ నాధ్ రెజ్లర్లకు ఇచ్చేందుకు మంచాలు తీసుకొచ్చారు. అయితే.. వీటిని వారికి ఇచ్చేందుకు పోలీసులు అంగీకరించలేదు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు, రెజ్లర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఘర్షణ చెలరేగింది. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
ఘటనలో రెజ్లర్లు భజ్ రంగ్ పూనియా (Bajrang Punia) తోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. తమను అవమానించేలా పోలీసులు ప్రవర్తించారని భజరంగ్ పూనియా భార్య సంగీత ఫొగాట్, రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) ఆరోపించారు. మంచాలకు అనుమతి లేదన్నందుకు ఎమ్మెల్యే అనుచరులే వాగ్వాదానికి దిగారని పోలీసులు అంటున్నారు. ఇందుకా తాము దేశం తరపున పతకాలు సాధించింది అంటూ వినేశ్ ఫొగట్ ఉద్వేగానికి గురైంది. తమ పతకాలు వెనక్కు తీసుకోవాలని భజరంగ్ పూనియా కోరారు.