మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలు హైదరాబాద్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడ్డాయి. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’ చైర్మన్ సంజయ్ కిషోర్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. సావిత్రి గారి అరుదైన ఫొటోలతో అలంకరించిన వేదిక ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వేదికపై మాట్లాడిన వెంకయ్య నాయుడు, సావిత్రి అనే మహానటికి అసలు మరణం అంటూ లేదని, ఆమె నటనా ప్రతిభ నవరసాల సౌందర్యాన్ని అద్భుతంగా ప్రతిబింబించిందని అన్నారు. ప్రతి పాత్రలో ఆమె పూర్తిగా మమేకమై నటించేవారని, పాత్ర మాత్రమే కనిపించేదాని గానీ సావిత్రి అనే వ్యక్తి కనిపించేది కాదని స్పష్టం చేశారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండలి సభ్యుడు బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, సినీరంగానికి సావిత్రి ఒక నటనాశాస్త్ర గ్రంథమని కొనియాడారు. ఎన్నో కథానాయికలు వచ్చినప్పటికీ ‘మహానటి’ అనే ఖ్యాతి మాత్రం సావిత్రిగారిదేనని ఆయన చెప్పారు.
ఈ వేడుకలో నటులు, నిర్మాత మురళీమోహన్, తనికెళ్ల భరణి, నన్నపనేని రాజకుమారి, రోజారమణి, శివపార్వతి తదితరులు పాల్గొని సావిత్రిని స్మరించుకున్నారు. ‘మహానటి’ చిత్రం నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్, రచయిత సంజయ్ కిషోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్యలకు ప్రత్యేక సన్మానాలు అందజేశారు.
సావిత్రి జయంతి సందర్బంగా 90 మంది బాల గాయనీమణులు సావిత్రి చిత్రాలలోని పల్లవులను ఆలపించడం వేడుకలో ప్రత్యేకమైన ఆకర్షణ గా నిలిచింది. అనంతరం సావిత్రి జీవితంపై రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. ఇటీవల నిర్వహించిన సావిత్రి పాటల పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. మొత్తం కార్యక్రమాన్ని సంజయ్ కిషోర్ సమన్వయం చేశారు.
