Sarath Kumar: తనను ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలకు 150 ఏళ్లు బతికి సీక్రెట్ చెప్తానని నటుడు, సమత్తువ మక్కల్ కచ్చి( SMK) అధ్యక్షుడు శరత్ కుమార్( Sarath Kumar) అన్నారు. ఆ పార్టీ 7 వ సర్వసభ్య సమావేశ బహిరంగ సభను సోమవారం మధురై లో నిర్వహించారు. ఇందులో పాల్గొని మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మద్యపాన నిషేధంపై పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆ దిశగా తమ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు.
‘ మద్యపానం, ధూమపానం మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. గంజాయి, గుట్కాల వాడకం మనిషి పెరుగుదలను ఆపేసి ఆయుర్దాయాన్ని తగ్గిస్తుంది. మన దేశానికి యువతే ప్రధాన ఆస్తి. 2025 నాటికి ప్రపంచ దేశాల్లోనే అత్యధికంగా యువత ఉన్న దేశంగా భారత్ నిలవబోతోంది. యువత బలాన్ని తగ్గించేందుకు విదేశాల నుంచి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం నా వయసు 69 ఏళ్లు. 2026 ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించి నన్ను సీఎంని చేస్తే 150 ఏళ్లు బతికే సీక్రెట్ చెప్తాను. నేను అలాంటి ట్రిక్స్ కొన్ని నేర్చుకున్నాను.
ఇక రాష్ట్రవ్యాప్తంగా మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా దృష్టి పెట్టి మద్యపానాన్ని నిషేధిస్తే బాగుంటుంది. డ్రగ్స్ నియంత్రణకి కూడా ప్రభుత్వం పూనుకోవాలి. ఈ మధ్యకాలంలో స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకోవడం నేను చాలాసార్లు చూశాను. పిల్లలపై పర్యవేక్షణ, డ్రగ్స్ పై నియంత్రణ కచ్చితంగా ఉండాలి ‘ అని శరత్ కుమార్ అన్నారు.