దేశవ్యాప్తంగా ఉన్న 12 “బ్లూ ఫ్లాగ్” బీచ్ ల్లో ఏపీలోని విశాఖ రిషికొండ బీచ్ ఒకటి. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత లో ఉన్నత ప్రమాణాలను పాటించడం వల్ల ఈ బీచ్ కి డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ 2020 లో ప్రఖ్యాత “బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్” ఇచ్చింది. ఇక్కడికి నెలకు దాదాపుగా 70 వేల నుంచి లక్ష మంది దేశీయ విదేశీయ పర్యాటకులు సందర్శిస్తున్నారు.
అయితే గత కొంతకాలంగా అక్కడ నిర్వహణ లోపం తలెత్తింది. బీచ్ లోకి వీధి కుక్కలు రావడం, స్నానపు గదులు అపరిశుభ్రంగా ఉండటం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, నడక దారిలో ఇబ్బందులు తలెత్తుతుండడంతో ఈ సమస్యను కొందరు పర్యాటకులు డెన్మార్క్ సంస్థ దృష్టికి తీసుకువెళ్లారు.
పది రోజుల్లో ఈ ఫిర్యాదు పై సమాధానం ఇవ్వాల్సిందిగా ఏపీ పర్యాటక అధికారులకు ఈనెల 13న మెయిల్ అందింది. దీనిపై స్పందించిన బీచ్ మేనేజ్మెంట్ కమిటీ ఒక సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్ణయించారు. ఈలోపే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్లు డెన్మార్క్ సంస్థ వెల్లడించింది.
అయితే బీచ్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కొంత సమయం కావాల్సి ఉంది. సందర్శకుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరిచేందుకు కొత్త పార్కింగ్ స్థలాలు, మెరైన్, లాండ్ & ఆర్డర్ పోలీసుల నియామకం, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, అధునాతన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇక ముఖ్యంగా పర్యాటకులు కంప్లైంట్ లో చెప్పిన కుక్కల నియంత్రణ, ఆహార వ్యర్ధాల నిర్వహణకు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ఈ పనులన్నీ రెండు, మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉన్నందున మార్చి 4న జరగబోయే సేఫ్టీ ఆడిట్ అనంతరం బ్లూ ఫ్లాగ్ స్టేటస్ తిరిగి పొందే అవకాశం ఉంది.
