Jr NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల నేపథ్యంలో హైద్రాబాద్లో జరిగిన ‘ఈవెంట్’కి ఆ తాతకి మనవడైన యంగ్ టైగర్ ఎన్టీయార్ ఎందుకు డుమ్మా కొట్టినట్లు.? గ్లోబల్ స్టార్గా పెరిగిన ఇమేజ్ నేపథ్యంలో అహంకారం ప్రదర్శించాడా.? టీడీపీ నేతృత్వంలో జరిగిన కార్యక్రమం కాబట్టి, లైట్ తీసుకున్నాడా.?
కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన టీడీ జనార్థన్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ ఎన్టీయార్ తనయుడితో కలిసి మరీ జూనియర్ ఎన్టీయార్కి టీడీ జనార్థన్ ఆహ్వానం పలికారు, శత జయంతి వేడుకలకు సంబంధించిన కార్యక్రమం కోసం.
అయితే, జూనియర్ ఎన్టీయార్ తన పుట్టినరోజునాడు దాదాపు 22 మంది స్నేహితుల బృందంతో (వారి కుటుంబాలతో సహా) ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నాడట. ముందే ఆ కార్యక్రమం నిర్ణయమవడంతో, శత జయంతి వేడుకకు రాలేకపోతున్నట్లు నిర్వాహకులకు జూనియర్ ఎన్టీయార్ సవివరంగా చెప్పాడట.
‘మేం అపాయింట్మెంట్ అడిగిన వారం రోజుల తర్వాత ఆయన్ను కలిసే అవకాశం మాకు లభించింది.. ముందే కొన్ని కమిట్మెంట్స్ వున్నందువల్ల రాలేకపోతున్నట్లు చెప్పారు. అది ఆయనిష్టం..’ అనేశారు టీడీ జనార్థన్. ‘ఇందులో ఆయన్ని తప్పు పట్టడానికి కూడా ఏమీ లేదు..’ అని టీడీ జనార్థన్ చెప్పుకొచ్చారు.
కానీ, సోషల్ మీడియాలో రచ్చ మాత్రం ఆగడంలేదు. జూనియర్ ఎన్టీయార్కీ నందమూరి అభిమానుల్లో బాలయ్యను మాత్రమే అభిమానించేవారికి, టీడీపీ కార్యకర్తలకీ జూనియర్ ఎన్టీయార్ ‘టార్గెట్’ అయిపోయాడు. అత్యంత జుగుప్సాకరమైన రీతిలో సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి జూనియర్ మీద.
తాత కంటే, స్నేహితులు ఎక్కువైపోయారా.? అన్నది జూనియర్ ఎన్టీయార్ మీద వస్తున్న విమర్శ. కాగా, తాత జయంతి రోజున, జూనియర్ ఎన్టీయార్ హైద్రాబాద్లోని స్వర్గీయ ఎన్టీయార్ ఘాట్ వద్ద నివాళులర్పించాడు.