ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న కరోనా వైరస్ కు కారణం ఎవరు అని అడిగితే.. ఠక్కున చైనా అనే సమాధానమే వస్తుంది. కావాలనే సృష్టించారో లేక ప్రపంచం కర్మ కొద్దీ వచ్చిందో అనే విషయాన్ని పక్కనపెడితే ఈ మహమ్మారి మాత్రం చైనా నుంచి ఉద్భవించింది అన్నది మాత్రం వాస్తవం. గతేడాది డిసెంబర్లో చైనాలోని వూహాన్ లో వెలుగు చూసిన ఈ వైరస్ గురించి ఆ దేశం ప్రపంచాన్ని సరిగా అప్రమత్తం చేయలేదనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా చైనాకే వంత పాడటంతో మిగిలిన దేశాలు సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం తీవ్ర మూల్యం చెల్లిస్తున్నాయి.
తాజాగా చైనా చేసిన పనికి సంబంధించి ఓ అంతర్జాతీయ టీవీ ఛానల్ కీలకమైన కథనం ప్రసారం చేసింది. కరోనా వైరస్ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేసే విషయంలో చైనా ఆరు రోజుల ఆలస్యం చేసిందని, దీంతో అప్పటికే అక్కడి నుంచి వివిధ దేశాలకు వైరస్ వెళ్లిపోయిందని పేర్కొంది. గతేడాది డిసెంబర్ 30న చైనా డాక్టర్ లీ.. ఈ వైరస్ గురించి అక్కడివారిని అప్రమత్తం చేశారు. అయితే, ఆయన తప్పుడు సమాచారం వ్యాపింపజేస్తున్నారనే కారణంతో లీ ని అరెస్టు చేశారు. అనంతరం జనవరి 9న చైనా వైద్య నిపుణులు ఈ వైరస్ ను ధ్రువీకరించారు. అయితే, ఇది అంత ప్రమాదకరం కాదని, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని స్పష్టంచేశారు. డబ్ల్యూహెచ్ఓకి కూడా ఇదే చెప్పారు.
జనవరి 14న థాయ్ ల్యాండ్ లో కరోనా కేసు నమోదైంది. దీంతో ఈ వైరస్ ప్రమాదకరమైనదంటూ చైనా అంతర్గతంగా ప్రకటించింది. ఆ తర్వాత ఆరు రోజులకు ఈ వైరస్ తీవ్రత గురించి ప్రపంచానికి తెలియజేసింది. అలాకాకుండా ఆరు రోజుల ముందుగానే ప్రపంచాన్ని అప్రమత్తం చేసి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేది కాదని ఆ కథనంలో పేర్కొన్నారు. ఆ ఆరు రోజుల్లో వూహాన్ నుంచి చాలామంది ప్రపంచంలోని వివిధ దేశాలకు ప్రయాణించడంతో వైరస్ కూడా వారితోపాటే చైనా దాటేసింది.
ఇక జనవరి 23న వూహాన్ లో పూర్తి లాక్ డౌన్ ప్రకటించారు. మరోవైపు అమెరికాలో జనవరి 21న తొలి కేసు నమోదు కాగా.. అధ్యక్షుడు ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు. అదేమీ ప్రమాదకర వైరస్ కాదని, ఏప్రిల్ లో వచ్చే ఎండలకు తాళలేక కనుమరుగైపోతుందని ప్రకటించారు. ఓవైపు అమెరికాలో కేసులు పెరుగుతున్నా.. సరైన చర్యలు తీసుకోకుండా ఆరు వారాలు ఆలస్యం చేశారు. దీంతో అక్కడ కేసులు, మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అగ్రరాజ్యంలో 17 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, మరణాలు లక్షకు చేరుకున్నాయి.