బండి భగీరథ్ పోక్సో కేసు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ, యాంకర్ మరియు నటి రష్మీ గౌతమ్ చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంలో తనను ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు వేస్తున్న నెటిజన్లకు రష్మీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తాను బీజేపీకి మద్దతుదారినేనని, కానీ రేపిస్టులు లేదా లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తులను ఎప్పటికీ సమర్థించనని స్పష్టంగా పేర్కొంది.
సమస్యలపై తాను సానుభూతి వ్యక్తం చేయగలనని, అయితే పోరాడేంత శక్తి తనకు లేదని రష్మీ వెల్లడించింది. తనను ట్యాగ్ చేసి దూషించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పిన ఆమె, నిజంగా న్యాయం కావాలనుకుంటే ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ, న్యాయవ్యవస్థను ట్యాగ్ చేసి ప్రశ్నించాలని సూచించింది.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మాత్రమే పరిష్కారం కాదని, తనను టార్గెట్ చేయడం ఆపాలని ఆమె కోరింది. ప్రస్తుతం ప్రతి అంశంలో నటీనటులను ట్యాగ్ చేయడం ఒక ఫ్యాషన్లా మారిందని, కానీ దాని వల్ల అసలు సమస్యలకు పరిష్కారం రాదని అభిప్రాయపడింది.
రష్మీ బీజేపీకి మద్దతు ఇస్తుండటంతో, బండి భగీరథ్ కేసులో ఎందుకు స్పందించడం లేదని కొందరు నెటిజన్లు ఆమెను నిలదీశారు. ఈ క్రమంలో వచ్చిన విమర్శలకు ఆమె పై విధంగా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

