Vyuham: ఎలాగోలా సినిమా విడుదల చేసేసుకోగలడు రామ్ గోపాల్ వర్మ. ఏ దారీ దొరక్కపోతే, ఎటూ ఓటీటీ ఒకటి ఏడ్చింది. సో, రామ్ గోపాల్ వర్మ సినిమాకి రిలీజ్ అనేది పెద్ద సమస్య కాదు.!
అసలు విషయం ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న ‘వ్యూహం’ సినిమా మాత్రం విడుదలయ్యేలా కనిపించడంలేదు. దానిక్కారణం, ‘వ్యూహం’పై పెరుగుతున్న మీమ్స్. వందల్లో వేలల్లో కాదు.. లక్షల్లో మీమ్స్ పోటెత్తుతున్నాయ్.
‘వ్యూహం కాదట కదా.. అది వ్యామోహం అట కదా.. మియా మాల్కోవాతో తియ్యాలనుకున్న జీఎస్టీ సీక్వెల్ని ఇదిగో ఇలా తీస్తున్నాడట కదా..’ ఇదీ సోషల్ మీడియాలో పోటెత్తుతున్న మీమ్స్ సారాంశం.
అత్యంత అసభ్యకరమైన రీతిలో కనిపిస్తున్నాయి ఈ మీమ్స్. అయితే, ఎక్కడా అసభ్యత వుండటంలేదు. అర్థం మాత్రమే అసభ్య కోణంలో కనిపిస్తోంది. అదే అసలు సమస్య.
‘వ్యూహం’ సినిమాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలే ఈ సినిమాకి నిర్మాతలు కూడా.! సినిమా నిర్మాణానికి వర్మ పెద్దగా ఖర్చు చేయడు. కాకపోతే, అతనికంటూ కొన్ని ఖర్చులుంటాయ్.. అవి చూసుకుంటే సరిపోతుంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ (‘రచ్చ’ సినిమాలో నటించాడు), వైఎస్ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ (‘హైవే’ అనే తెలుగు సినిమాలో నటించింది) నటిస్తున్నట్లు వర్మ తాజాగా ప్రకటించాడు. ఈ మేరకు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి కూడా.
ఈ ఫొటోల్ని పట్టుకుని కుప్పలు తెప్పలుగా మీమ్స్ సృష్టిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ ఈ మీమ్స్ని తయారు చేయిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మీమ్స్ ద్వారా వైఎస్ జగన్, వైఎస్ భారతి ఇమేజ్ డ్యామేజ్ అవుతోందన్నది నిర్వివాదాంశం. ఫొటోలకే పరిస్థితి ఇలా వుంటే, రేప్పొద్దున్న సినిమా.. ఇంకేమవుతుందో.!
‘వద్దు బాబోయ్’ అంటూ వైఎస్ జగన్ స్వయానా, రామ్ గోపాల్ వర్మని సినిమా విడుదల కానివ్వకుండా ఆదేశిస్తారేమో’ అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఏమో, అదే జరుగుతుందేమో కూడా.!