Ram Charan: అభిమానుల ఆనందమే తమ ఆనందంగా హీరోలు.. హీరోల విజయమే తమ విజయాలుగా భావించే అభిమానులు. హీరో ఎవరైనా అభిమానులపై చూపే ప్రేమ ఇంతే. అటువంటి అభిమానులు దూరమవడం హీరోలను బాధించే అంశం. ఇటివల ‘గేమ్ చేంజర్’ ప్రీ-రిలీజ్ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు అభిమానులు (అరవపల్లి మణికంఠ, తోకడ చరణ్) మృతి చెందిన సంగతి తెలిసిందే.
అభిమానుల మృతిపై రామ్ చరణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ అభిమానుల తల్లిందండ్రులకు అండగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు ఈక్రమంలో వారికి సాంత్వన చేకూర్చేందుకు ఆర్దిక సాయం చేశారు. రామ్ చరణ్ ఆదేశాల మేరకు అఖిల భారత చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ ఆధ్వర్యంలో చిరంజీవి అభిమానులు మృతుల కుటుంబాలను నేడు కలిశారు.
మణికంఠ తల్లి భవానీ, చరణ్ తండ్రి తోకడ అప్పారావును కలిసి రామ్ చరణ్ అందించిన ఆర్ధికసాయంకు సంబంధించిన పత్రాలను ఏడిద బాబీ అందజేశారు. ఈక్రమంలో వారి కుటుంబాలకు అండగా ఉంటామని రామ్ చరణ్ మాటగా చెప్పారు. వారి కుటుంబాలకు జరిగిన అన్యాయం పూడ్చలేనిదని.. కొంతైనా వారికి ఆర్ధిక భరోసా అందివ్వాలనేది రామ్ చరణ్ అభిప్రాయమని తెలిపారు.
