రాజుగారి మొదటి గది.. అదేనండీ, ‘రాజు గారి గది’ సినిమా సూపర్ హిట్టయ్యింది. దాంతో, దర్శకుడు ఓంకార్ ఇంకో అడుగు ముందుకేసి, భారీ బడ్జెట్తో నాగార్జున, సమంత కాంబినేషన్లో రెండో ‘రాజు గారి గది’ తీశాడు. నాగార్జున స్టార్డమ్ కావొచ్చు, సమంత పాపులారిటీ కావొచ్చు.. ఈ రెండో గదిని ఆసక్తికరంగా మార్చలేకపోయాయి. సినిమా డిజాస్టర్గా మిగిలింది. దాంతో దర్శక నిర్మాత ఓంకార్ సైలెంటయిపోయాడు. మధ్యలో ఓ టెలివిజన్ షో చేసి, మళ్ళీ ఇప్పుడు మూడో గది షురూ చేశాడు.
ఈసారి మూడో గది కోసం మిల్కీ బ్యూటీ తమన్నాని తీసుకొస్తున్నాడు దర్శక నిర్మాత ఓంకార్. అశ్విన్బాబు హీరోగా రూపొందనుంది ఈ సినిమా. తొలి సినిమాలానే మూడో గది అదిరిపోతుందని చెబుతన్న ఓంకార్, ఈసారి మరింత జాగ్రత్తగా స్క్రిప్ట్ రెడీ చేశానని అంటున్నాడు. సినిమా ప్రారంభోత్సవం కాస్సేపటి క్రితం జరిగింది. తమన్నా ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
మరోపక్క, ఇటీవలి కాలంలో తమన్నా నటిస్తున్న సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడిపోతున్న విషయం విదితమే. తెలుగులో కళ్యాణ్రామ్తో చేసిన ‘నా నువ్వే’ కావొచ్చు, ప్రభుదేవాతో కలిసి చేసిన తమిళ – తెలుగు సినిమా ‘అభినేత్రి’ కావొచ్చు.. దారుణంగా దెబ్బ తీనేశాయి. పైగా, ఈ మధ్య అన్నీ దెయ్యం సినిమాలే వస్తున్నాయి తమన్నాకి. ఈ పరిస్థితుల్లో తమన్నా నుంచి మరో దెయ్యాల సినిమాని ప్లాన్ చేసిన ఓంకార్, ఈసారేం చేస్తాడోనన్న చర్చ అంతటా జరుగుతోంది.
‘రాజు గారి గది’ సినిమాకి కామెడీ ప్లస్ అయ్యింది.. థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ సంగతెలా వున్నా, సినిమాలో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అయితే వుంది. కానీ, రెండో రాజు గారి గదిలో అవేమీ కన్పించలేదు. అయితే, రెండో రాజుగారి గదికి సంబంధించి చోటు చేసుకున్న పొరపాట్లను రిపీట్ కాకుండా పక్కా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట ఓంకార్. కథ చాలా బాగా వచ్చిందనీ, ‘రాజు గారి గది’ లానే, ‘రాజు గారి గది 3’ కూడా ట్రెండ్ సెట్టింగ్ అవుతుందనీ ఓంకార్ అంటున్నాడు.
