Rahul Gandhi: సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై లోక్ సభ సచివాలయం శుక్రవారం అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత తొలిసారి రాహుల్ గాంధీ మీడియా ముందుకు వచ్చారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఎన్ని కేసులు పెట్టినా, ఆఖరికి జైలుకు పంపిన సరే తాను వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘ ప్రధాన మోదీ ప్రభుత్వం నన్ను చూసి భయపడుతోంది. నేను క్షమాపణలు చెప్పాలని కొందరు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. క్షమించమని అడగడానికి నేను సావర్కర్ ని కాను. గాంధీని. నన్ను జైలుకు పంపినా సరే అదానీ విషయంపై మాట్లాడటానికి సంకోచించను. అదానీ వివాదంపై ప్రజల దృష్టి మరల్చడానికి అనర్హత డ్రామాలు ఆడుతున్నారు. అనర్హుడిగా ప్రకటించి నా గొంతు నొక్కినంత మాత్రాన నేను ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడకుండా వెనకడుగు వేయను. ఈ విషయంలో నాకు మద్దతిస్తున్న ప్రతిపక్ష నేతలు అందరికీ ధన్యవాదాలు. నేను పార్లమెంట్ లోపల ఉన్నా..బయట ఉన్నా నన్ను ఎన్నుకున్న ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను. ప్రజల నుంచి నన్ను ఎవరు వేరు చేయలేరు. ప్రజా సమస్యలపై నన్ను మాట్లాడనివ్వాలని స్పీకర్ కి లేఖ రాశాను. అయినప్పటికీ బీజేపీ నేతలు నన్ను మాట్లాడకుండా అడ్డుకున్నారు’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.