కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను హరించడమే కాకుండా దాని కారణంగా జనులంతా అష్ట కష్టాలు పడుతున్నారు. మనిషి నుంచి మనిషికి సోకే ఈ వైరస్ ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడినవారికి మాత్రమే సమస్యలు ఉండగా.. ఇప్పుడు మొత్తం అందరినీ ఇది చుట్టుముట్టింది. కరోనాను సమర్థంగా ఎదుర్కోవడానికి ‘స్టే హోమ్.. బీ సేఫ్’ అని అంటున్నారు. కానీ ఇప్పుడు పలువురికి ఇదే సమస్యగా మారింది.
ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరంలో జనం పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని చెబుతూ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించింది. ఇంటి నుంచి మూడు కిలోమీటర్లు మినహా ఇంక ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఉద్యోగరీత్యా వైద్యులు, పోలీసులు, మీడియా సిబ్బంది బయటకు వెళ్లి రావాల్సిన అవసరం ఉంది. అయితే, అలా బయటకు వెళ్లినవారిని తిరిగి ఇంటికి రావొద్దంటూ ఆయా ఇళ్ల యజమానులు గట్టిగా చెబుతున్నారు.
లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ఇంట్లోనే ఉండాలని, లేకుంటే ఇల్లు ఖాళీ చేసేయాలని మొహమాటం లేకుండా స్పష్టంచేస్తున్నారు. ఇప్పటికే వరంగల్, ఢిల్లీ వంటి చోట్ల కరోనాకు చికిత్స చేస్తున్నారనే కారణంతో పలువురు వైద్యులను ఇల్లు ఖాళీ చేయించారు. తాజాగా మీడియా సిబ్బందితోపాటు ఇతర అత్యవసర సేవల ఉద్యోగులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. దీంతో వారు విధులకు వెళ్లాలా లేక ఇంట్లోనే ఉండాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
వీరి పరిస్థితి ఇలా ఉంటే.. హాస్టళ్లలో ఉంటున్నవారు మరో రకంగా ఇబ్బందిపడుతున్నారు. హైదరాబాద్ లో విద్యార్థులతోపాటు ఉద్యోగాలు చేసే బ్యాచిలర్స్ హాస్టళ్లలో పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. అలాంటివారిని వెంటనే హాస్టల్ ఖాళీ చేయాలని నిర్వాహకులు ఒత్తిడి చేస్తున్నారు. పోనీ ఖాళీ చేసి సొంతూరికి వెళదామంటే పోలీసు ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియక బుధవారం పలువురు యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పంజాగుట్ట పోలీసు స్టేషన్ కి వచ్చారు. తమ సొంతూరికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. మొత్తానికి కరోనా మహమ్మారి అందరినీ అష్టకష్టాలూ పెడుతోంది. దీనికి ముగింపు ఎప్పుడో?
297412 862669Glad to be 1 of numerous visitants on this wonderful internet website : D. 567399