గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇప్పటికే వామపక్షాల ఆధ్వర్యంలో సిలిండర్లతో రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్లతో ప్రధాని మోదీ, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ మాస్కులు ధరించి ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా నిరసనలు తెలిపారు. అయితే.. సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలియజేశాడు.
ఏకంగా సిలిండర్ నే దేవతామూర్తిగా కొలుస్తూ దండ వేసి మరీ ధరలు తగ్గించాలని నిరసన తెలియజేస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన దేవరాజు పెరుగుతున్న ధరలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గ్యాస్ సిలిండర్ కు పూలదండ వేసి పూజ చేశాడు. పెట్రోల్, డీజిల్ సీసాలకు హారతులిచ్చాడు. పెంచిన ధరలతో సామన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేంద్రం పెనుభారం మోపడం సరికాదంటున్నాడు. ఇప్పటికైనా ధరలు తగ్గించాలని కోరుతున్నాడు.