ఇంతకు ముందు సోషల్ మీడియాలో స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ హీరో సినిమా అంత వసూళ్లు చేసింది.. తమ హీరో టీజర్ ట్రైలర్ వీడియోలు యూట్యూబ్ లో ఇన్ని రికార్డులు సొంతం చేసుకుంది అంటూ ప్రచారం చేసేవారు. ఇప్పుడు ఆయా స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలు కరోనా విపత్తు నేపథ్యంలో ఇస్తున్న విరాళాల గురించి ప్రముఖంగా ప్రచారం చేస్తున్నారు. తమ హీరో గొప్ప మనసుతో కోటి ఇచ్చాడని కొందరు మా హీరో కూడా కోటి ఇచ్చాడంటూ మరో హీరో అభిమానులు అంటున్నారు.
టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ అందరిలోకి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం కాలర్ ఎగరేసుకుని మరీ గొప్పగా చెప్పుకుంటున్నారు. కరోనా విపత్తు నేపథ్యంలో ప్రభాస్ ఏ టాలీవుడ్ స్టార్ ఇవ్వనంత విరాళంను ఇచ్చాడు. 3 కోట్లను ప్రధాన మంత్రి సహాయ నిధికి మరో కోటిని తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల సహాయ నిధికి ఇవ్వడం జరిగింది. మొత్తం నాలుగు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించిన ప్రభాస్ మరోసారి తన దాతృత్వంను చూపించాడు.
చిరంజీవి ఆధ్వర్యంలో సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిసి ఛారిటీ ని ఏర్పాటు చేసి విరాళాలు సేకరిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే విరాళాలు ఇచ్చిన వారు కూడా ఈ సీసీసీ కోసం విరాళాలు ఇస్తున్నారు. తాజాగా ప్రభాస్ ఈ సీసీసీ కోసం ఏకంగా 50 లక్షల రూపాయల విరాళం ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు. ఈ సమయంలో సినీ కార్మికులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అందుకే 50 లక్షల విరాళంతో తనవంతు సాయం చేస్తున్నట్లుగా ప్రభాస్ అన్నాడు. దీంతో ఫ్యాన్స్ ను మరోసారి కాలర్ ఎత్తుకుని తిరిగేలా ప్రభాస్ చేశాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.