జపనీస్ కత్తిసాము యుద్ధకళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను ప్రశంసిస్తూ అభినందన సందేశం పంపారు. ప్రజా జీవితం, సినిమా రంగంలో బిజీగా ఉంటూనే మార్షల్ ఆర్ట్స్లో దశాబ్దాలపాటు అంకితభావంతో సాధన చేయడం స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. వృత్తిపరమైన బాధ్యతలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి అడ్డంకి కావని పవన్ కళ్యాణ్ సాధన యువతకు బలమైన సందేశమని మోదీ అన్నారు.
మార్షల్ ఆర్ట్స్ అనేవి శారీరక బలంతో పాటు మానసిక సమతుల్యత, సహనం, స్వీయ నియంత్రణను పెంపొందిస్తాయని ప్రధాని తన సందేశంలో తెలిపారు. ఇంతటి కఠినమైన సంప్రదాయాన్ని అనుసరించడం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని ప్రశంసించారు. ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా ఆరోగ్యకరమైన, చురుకైన సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యానికి ప్రజా జీవితంలో ఉన్న నాయకుల క్రమశిక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఫిట్నెస్ పట్ల పవన్ కళ్యాణ్ చూపుతున్న నిబద్ధత ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని మోదీ అన్నారు.
ప్రధాని అభినందనలకు స్పందించిన పవన్ కళ్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మోదీ పంపిన ఆత్మీయ సందేశం తనకు గొప్ప గౌరవమని, మరింత ప్రోత్సాహాన్నిచ్చిందని చెప్పారు. యుద్ధకళలు శారీరక శ్రమతో పాటు ఏకాగ్రత, ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇస్తాయని పేర్కొన్నారు. జీవితకాల అభ్యాసం, స్వీయాభివృద్ధిపై ప్రధాని ఇచ్చిన సందేశం తనకు ఎంతో స్ఫూర్తినిస్తోందని అన్నారు.
ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలను తీసుకువచ్చిన ప్రధాని దూరదృష్టిని పవన్ కళ్యాణ్ కొనియాడారు. మోదీ నాయకత్వంలో బలమైన, క్రమశిక్షణగల భారతదేశం రూపుదిద్దుకుంటోందని, స్వామి వివేకానంద ఆకాంక్షించిన సమాజం ఆవిష్కృతమవుతుందని చెప్పారు. గొప్ప నాయకుడి నుంచి లభించిన ఈ ప్రోత్సాహం ప్రజలకు మరింత అంకితభావంతో సేవ చేయాలన్న తన సంకల్పాన్ని బలపరుస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
