‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి. మూడో పాటగా మేకర్స్ గురువారం సాయంత్రం విడుదల చేసిన ‘నీతో ఈ గడిచిన కాలం’ అనే పాట ఆకట్టుకుంటోంది. ఈ పాట కూడా ‘కనుల చాటు మేఘమా’, ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టైటిల్ సాంగ్ తరహాలోనే వినసొంపుగా, వినగానే నచ్చేలా ఉంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ చిత్రాలలోని మెలోడీ పాటలు ఎంతలా ఆకట్టుకున్నాయో.. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి విడుదలవుతున్న ఒక్కో పాట అంతకుమించి అనేలా ఉన్నాయి. ‘నీతో ఈ గడిచిన కాలం’ పాట చిరుజల్లులో ప్రేయసితో కలిసి నడిచినట్లుగా హాయిగా ఉంది. మెలోడీలను స్వరపరచడంలో కళ్యాణి మాలిక్ ది ప్రత్యేక శైలి అని ఈ పాటతో మరోసారి రుజువు చేసుకున్నారు. ఈ పాటకు ప్రముఖ గీత రచయిత భాస్కర భట్ల రవికుమార్ అద్భుతమైన సాహిత్యం అందించారు. “నీతో ఈ గడిచిన కాలం నడిచిన దూరం ఎంతో ఇష్టం చెవిలో చెప్పే కబురులు అన్నీ ఇష్టం ఇష్టం ఇష్టం” అంటూ సాగిన పాటలోని ప్రతి వాక్యం ఆకట్టుకుంటోంది. గాయని గీతామాధురితో కలిసి కళ్యాణి మాలిక్ ఈ పాటను ఎంతో అందంగా ఆలపించారు. ఈ పాటలో “విడి విడి రెండు ప్రాణాలిలా.. ముడిపడి ఏకమయ్యాయిలా.. మన పయనం సాగాలి వెన్నెల్లో గోదారిలా” అనే వాక్యముంది. దానికి తగ్గట్లుగానే నిజంగానే ఈ పాట వెన్నెల్లో గోదారిలా ఉంది.
నాయకా నాయికలకు ఒకరిపై ఒకరికున్న ఇష్టాన్ని, ప్రేమని తెలిపేలా సాగిన ‘నీతో ఈ గడిచిన కాలం’ సాంగ్ లిరికల్ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది.
పాట ఎంత అందంగా ఉందో.. లిరికల్ వీడియోలోని ప్రతి ఫ్రేమ్ అంత అందంగా ఉన్నాయి. వీడియోలో కథానాయకుడు బాలగంగాధర తిలక్ రచించిన ప్రసిద్ధ కవితా సంపుటి ‘అమృతం కురిసిన రాత్రి’ని చదవడం చూస్తుంటే అతనికి సాహిత్యంపై మక్కువ ఉన్నట్లుగా అర్థమవుతోంది.
