అమరావతిలో తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతుల సందర్భంగా మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. ప్రస్తుతం టిడిపి 3.0 వర్షన్తో ముందుకెళ్తోందని, ఇకపై పైరవీలు కాదు.. పనితీరు, కేడర్ కష్టమే పదవులకు ప్రామాణికమవుతుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ గ్రామస్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు సమూల మార్పులు తీసుకువస్తున్నామని, ప్రతి టర్మ్లో కనీసం 33 శాతం కొత్తవారికి అవకాశం కల్పించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న కేడర్ శిక్షణా తరగతుల్లో భాగంగా “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జ్లతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సభ్యత్వ నంబర్ పార్టీ కార్యకర్తలకు ఆధార్ కార్డు లాంటిదని, ఆ నంబర్ ఆధారంగా ఎవరు ఎంత పనిచేశారో గుర్తించే వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. ఎలాంటి సిఫార్సులు, లాబీయింగ్ లేకుండా కష్టపడే కార్యకర్తలను గుర్తించి వారికి తగిన బాధ్యతలు ఇస్తామని చెప్పారు.
పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేయడమే ఈ శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశమని లోకేష్ వివరించారు. ఇకపై క్లస్టర్, యూనిట్, గ్రామ, మండల స్థాయిల వరకు ఏడాది పొడవునా నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీని ఒక రాజకీయ విశ్వవిద్యాలయంగా అభివర్ణించిన ఆయన, తెలంగాణలో ఉన్న అనేక మంది ప్రముఖ నాయకులు టిడిపి నుంచి వచ్చిన వారేనని గుర్తుచేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత విస్తృత స్థాయిలో కేడర్కు శిక్షణ ఇవ్వడం ఇదే మొదటిసారి అని చెప్పారు.
టిడిపి ఒక కేడర్ బేస్డ్ పార్టీ అని, ఇందులో వ్యక్తులు శాశ్వతం కాదని, పార్టీ మాత్రమే శాశ్వతమని లోకేష్ స్పష్టం చేశారు. “నేనే అన్నీ” అనే భావనతో కాకుండా, వ్యవస్థపై ఆధారపడే రాజకీయ సంస్కృతి అవసరమని పేర్కొన్నారు. గతంలో వ్యక్తులను నమ్మడం వల్ల పార్టీ నష్టపోయిందని, ఇప్పుడు వ్యవస్థను బలపరచడంపైనే దృష్టి పెట్టామని అన్నారు. దీర్ఘకాలంగా అధికారంలో నిలవాలంటే క్రమశిక్షణ, బాధ్యతాయుత కేడర్ అవసరమని, ఈ విషయంలో బీజేపీని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
తన రాజకీయ ప్రయాణాన్ని ఉదాహరణగా చెబుతూ, మంగళగిరిలో మొదటి ప్రయత్నంలో ఓడిపోయినా, ఐదేళ్లపాటు పట్టుదలతో పనిచేసి భారీ మెజారిటీతో గెలిచానని లోకేష్ చెప్పారు. గెలిచిన తర్వాత కూడా కొన్ని బూత్లలో పార్టీ వెనుకబడిన విషయాన్ని గుర్తించి, వాటిని అధిగమించేందుకు హోంవర్క్ చేస్తున్నానని తెలిపారు. పార్టీలో సమస్యలు ఉంటే వాటిని అంతర్గత వేదికలపై చర్చించి పరిష్కరించుకోవాలని, అలిగి పక్కన కూర్చోవడం పార్టీకి నష్టం చేస్తుందని హెచ్చరించారు. రాబోయే మహానాడు విజయవంతం చేయడం కోసం ప్రతి కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చారు.
గత ఐదేళ్ల వైసిపి పాలనలో కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని లోకేష్ ఆరోపించారు. దేవాలయాలపై దాడులు, పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యాలు, వేల సంఖ్యలో తప్పుడు కేసులు నమోదయ్యాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులను సమీక్షించి, దాదాపు 60 శాతం కేసులను తొలగించామని తెలిపారు. ఇప్పుడు అధికారంలో ఉన్నామనే అహంకారం వద్దని, కష్టకాలంలో ఎదురైన అనుభవాలను గుర్తుంచుకుని ఓర్పుతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
పార్టీలో ఎవరి పదవులు శాశ్వతం కావని, బాధ్యతలను సరిగా నిర్వహించని వారిని పలుమార్లు హెచ్చరించిన తర్వాత అవసరమైతే కొత్తవారికి అవకాశం ఇస్తామని లోకేష్ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వమే పార్టీకి బలం అని, ఆయన వంటి మహావృక్షం నీడలోనే టిడిపి కేడర్ ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు. కేడర్కు దగ్గరగా ఉండటం, వారి కష్టసుఖాలను తెలుసుకోవడం, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం ఇప్పుడు పార్టీ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
వైసిపి అధినేత జగన్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని లోకేష్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడూ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ జగన్ ప్రజలకు దూరంగానే ఉన్నారని విమర్శించారు. 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నిరంతరం ప్రజల్లోనే ఉన్నారని, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. కేడర్కు చేరువగా ఉండటం ద్వారానే పార్టీ బలపడుతుందని ఆయన అన్నారు.
ఇకపై హానీమూన్ పీరియడ్ ముగిసిందని, అందరూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిన సమయం వచ్చిందని లోకేష్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. జూన్ తర్వాత ప్రభుత్వం సాధించిన విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా వెనుకబడి ఉన్న బూత్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి బూత్ పార్టీకి అత్యంత కీలకమని చెప్పారు. కూటమి మళ్లీ అధికారంలోకి రావాలంటే కేడర్ మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని, కార్యకర్తే అధినేత అనే భావనను మరింత బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

