Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో సినిమా అఫిషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. జూన్ 4వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీగా సినిమా విడుదులవుతున్నట్టు టీమ్ ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 25న విడుదలవుతున్నట్టుగా బుచ్చిబాబు ఓ సందర్భంలో చెప్పినా సినిమాకు ఉన్న డిమాండ్, అభిమానుల ఆకాంక్షల మేరకు జూన్ 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. జూన్ 3వ తేదీనే ప్రీమియర్స్ ఉంటాయని చిత్ర నిర్మాత సతీశ్ కిలారు ప్రకటించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్లో, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీస్ సమర్పణలో సినిమా తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ ఈవెంట్లో దర్శక, నిర్మాతలు మాట్లాడారు.
బుచ్చిబాబు.. ‘ఏప్రిల్ 30న రానందుకు క్షమించండి. జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి. జూన్ 4న నా ప్రేమను చరణ్ గారిలో చూద్దురుగానీ. పెద్ది అందరికీ దగ్గరగా ఉంటాడు. పెద్దిని అందరి హృదయాల నుంచి తీసేయడం అంత సులువు కాదు. చాలా ఎమోషన్స్ ఉన్న సినిమా పెద్ది. సినిమా అందరినీ అలరిస్తుందనే బలమైన నమ్మకంతో ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రామ్ చరణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పెద్ది క్యారెక్టర్ ను అభిమానులు ఎంతో ఇష్టపడతా’రని అన్నారు.
సతీశ్ కిలారు.. ‘సినిమాను నిర్మించే అవకాశం నాకు ఇచ్చినందుకు రామ్ చరణ్ గారికి కృతజ్ఞతలు. ఒక్క సినిమా అనుభవం లేకపోయినా నాకు అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. చాలా అంశాలు ఉన్న భారీ కథ ఇది. చిన్నా-పెద్దా ఇంటిల్లపాదినీ అలరించే సినిమా ఇది. పెద్ద కాన్వాస్ ఉన్న సినిమాను బుచ్చిబాబు అద్బుతంగా తెరకెక్కించారు. నటీనటులంతా చక్కగా నటించి ఇంత పెద్ద సినిమాను అద్భుతంగా వచ్చేందుకు కారణమయ్యారు. అందరికీ థ్యాంక్స్’ అని అన్నారు.
సుకుమార్.. ‘చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ ఇధి. ఇంత పెద్ద స్క్రిప్ట్ రాసుకున్న బుచ్చిబాబును అభినందిస్తున్నాను. చాలా మంచి ఆలోచనతో కథ రాసుకున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరించాలంటే చాలా అనుభవమున్న దర్శకుడి వల్లే సాధ్యం. ఉప్పెనను అద్భుతంగా మలచిన బుచ్చిబాబుకు ఇది సాధ్యమైంది. చాలా ఎమోషన్స్ సినిమాలో ఉంటాయి. ఇంతటి అద్భుతమైన ఎమోషన్స్ ఉన్న సినిమా ఈమధ్య కాలంలో రాలేదని చెప్పగలను. రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘రంగస్థలం’ను మించి నటన ప్రదర్శించాడు. నటనలో చాలా హైట్స్ కి వెళ్లాడు. రై రై రారా పాటలో తన ఎనర్జీ చూస్తే మనసులో సినిమాపై ఎంతగా ఇష్టం పెంచుకున్నాడో అర్ధమవుతోంది. రంగస్థలం హిట్ కావాలని కోరుకున్నా. కారణం.. అందరిలో చిరునవ్వులు ఉండాలి.. అవి ఎప్పటికీ ఉండాలని. తొలి సినిమానే ఇంతటి భారీ సినిమాని నిర్మిస్తున్నందుకు సతీశ్ గారిని అభినందిస్తున్నా. అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ గారికి కృతజ్ఞతల’ని అన్నారు. కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా పాల్గొన్నారు.
