జనసేన పార్టీని క్రమశిక్షణ కలిగిన సిద్ధాంత సమూహంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో జనసేన సమావేశాల్లో కనిపించిన హడావుడి, యువత ఉత్సాహం ఇప్పుడు క్రమశిక్షణగా మారిందని, పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకున్న యువత ఇప్పుడు దేశానికి వెన్నెముకలా నిలిచే సిద్ధాంత బలంగా తయారవుతోందని చెప్పారు.
రాజమహేంద్రవరంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సాధక్లతో జరిగిన సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ సగటు మనిషి ఆవేదన నుంచి పుట్టిందని పేర్కొన్నారు. 20 వేల మంది సాధక్లు, 21 లక్షల మంది ఉద్యమీల శక్తితో పార్టీ ముందుకు సాగుతోందన్నారు. తన జీవిత అనుభవాలు, సమాజంలో మార్పు కోసం కలిగిన ఆవేదనే ఉద్యమానికి కారణమైందని చెప్పారు. “నా సంపద, సంపాదన అంటే ఉద్యమీలు, సాధక్లే” అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.
పార్టీ కోసం మొదటి నుంచి నిలబడ్డ జనసైనికులు, వీరమహిళలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పార్టీ సిద్ధాంతం, భావజాలం చిరస్థాయిగా నిలవాలని తన ఆకాంక్ష అని తెలిపారు. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకు 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జ్లతో పాటు ప్రత్యేక బృందాలు పని చేస్తాయని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు తమ సేవలను దరఖాస్తుల రూపంలో కమిటీలకు అందించాలని సూచించారు.
ఇకపై పార్టీపై, తనపై ఇష్టానుసారం విమర్శలు చేసే వారిపై గట్టిగా స్పందిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు కూడా తేనెతుట్టెలా సమిష్టిగా ప్రతిస్పందించాలని పిలుపునిచ్చారు. ఆధారాలతో, విజ్ఞానంతో మాట్లాడాలని సూచించారు. ప్రజా సమస్యలపై బాధ్యతగా వ్యవహరించని ప్రసార మాధ్యమాలపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరి కాలుష్యం వంటి కీలక సమస్యలను మీడియా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కాపు నాయకుల పేరుతో తనపై జరుగుతున్న విమర్శలపై కూడా పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. తాను ఎప్పుడూ కుల రాజకీయాల కోసం పార్టీ పెట్టలేదని, దేశం, రాష్ట్రం, ప్రజల అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తనతో నడిచిన వారు ఏ కులానికి చెందిన వారైనా వారికి పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. జనసైనికులు, వీరమహిళలు కులాల చట్రంలో ఇరుక్కుపోవద్దని సూచించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన బలంగా నిలవాలని, పార్టీ నిర్మాణ ప్రక్రియలో సాధక్లు కీలక పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇక నుంచి ప్రతి సాధక్, ఉద్యమితో ప్రత్యక్ష కమ్యూనికేషన్ కొనసాగిస్తానని తెలిపారు.



