అమరావతి: గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైసీపీ పాలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని విమర్శించారు. ఆ ఆర్థిక విధ్వంసం కారణంగా రాష్ట్ర అభివృద్ధి దాదాపు 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం పరిమిత వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పనిచేస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిందని అన్నారు. ఈ బడ్జెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వ దూరదృష్టి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో అభివృద్ధి, సంక్షేమం, పారదర్శకత, జవాబుదారీతనం అనే నాలుగు అంశాలపై ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వం సుమారు రూ.9.74 లక్షల కోట్ల అప్పులను రాష్ట్రంపై మోపిందని పవన్ కళ్యాణ్ అన్నారు. కాంట్రాక్టర్లు, వెండర్లకు చెల్లించకుండా వదిలేసిన బకాయిలే రూ.1.35 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రూ.25 వేల కోట్ల బకాయిలను చెల్లించామని చెప్పారు. వివిధ శాఖల అభివృద్ధి పనుల కోసం మరో రూ.37 వేల కోట్లను విడుదల చేసినట్లు వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యుత్ సంస్థలు భారీ నష్టాలు చవిచూశాయని పవన్ కళ్యాణ్ విమర్శించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయడం వల్ల డిస్కంలకు రూ.12,250 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. ఐదేళ్లలో విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.1.29 లక్షల కోట్ల మేర నష్టపోయాయని, ఆ భారం ప్రజలపై విద్యుత్ బిల్లుల రూపంలో పడిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేసి, ట్రూ డౌన్ ద్వారా విద్యుత్ ఛార్జీలను తగ్గించామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వినియోగించడంలో కూడా గత ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. పీఎంఏవై అర్బన్, ఆయుష్మాన్ భారత్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ వంటి పథకాల కింద రావాల్సిన రూ.10,500 కోట్ల నిధులను సక్రమంగా వినియోగించలేదని చెప్పారు. రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు కూడా నిలిచిపోయిందని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జల్ జీవన్ మిషన్కు పునరుత్తేజం ఇచ్చామని పవన్ కళ్యాణ్ తెలిపారు. పులివెందుల, డోన్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఐదు జిల్లాల పరిధిలో రూ.7,910 కోట్లతో మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని మూడు వేల గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ పాలనలో ఐదేళ్లలో గ్రామీణాభివృద్ధికి రూ.4,610 కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే రూ.11,506 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. అదే విధంగా సీసీ, బీటీ రోడ్ల నిర్మాణంలో కూడా గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు.
విద్యాశాఖలో కూడా పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. తల్లికి వందనం వంటి పథకాల ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా వేలాది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు.
న్యాయవ్యవస్థకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పారు. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయని, కోర్టుల మౌలిక వసతులను మెరుగుపరచడం అవసరమని అన్నారు. కొత్త కోర్టు భవనాల నిర్మాణంతో పాటు డిజిటల్ మౌలిక వసతులు, వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థలు, ఆటోమేటెడ్ కేసు నిర్వహణ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తే విచారణ వేగవంతం అవుతుందని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి నాయకులు ఐక్యంగా ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. చిన్నచిన్న విభేదాలను పక్కన పెట్టి ప్రజల ఆశలు నెరవేర్చే దిశగా పనిచేయాలని అన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే కూటమి ప్రభుత్వం దీర్ఘకాలం అధికారంలో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
