ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి 100 రోజుల్లో రోడ్మ్యాప్ రూపొందిస్తామని తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో మత్స్యకారులతో జరిగిన “మాటా–మంతి” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మత్స్యకారులు చెప్పిన ప్రతి సమస్యను ఓపికగా విని ప్రాథమిక పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని హామీ ఇచ్చారు.
ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతున్నదని గుర్తిస్తూ, రక్షణ గోడ నిర్మాణం కోసం రూ.300 కోట్ల ప్రాజెక్ట్పై చర్యలు ప్రారంభించినట్టు చెప్పారు. రెండు, మూడేళ్లలో ఈ గోడ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అవసరమైతే మరోసారి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారితో మాట్లాడుతానని చెప్పారు.
హార్బర్ డిజైన్ లోపాల సవరణకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని, చెన్నై ఐఐటీ నిపుణులతో చర్చలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. పరిశ్రమల కాలుష్యంపై వారంలోపు పొల్యూషన్ ఆడిట్ నిర్వహించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. “ఆడిట్ అనేది పరిశ్రమలను భయపెట్టడానికేం కాదు, కాలుష్య స్థాయిని అర్థం చేసుకోవడానికే” అని చెప్పారు.
మత్స్యకారుల అభ్యర్థన మేరకు సముద్ర జలాల్లో ప్రత్యక్షంగా కాలుష్య పరిస్థితులను పరిశీలిస్తానని తెలిపారు. “పరిశ్రమలు రావాలి, కానీ పర్యావరణం, మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకూడదు. సమస్యకు కచ్చితమైన పరిష్కారం కనుగొంటాం” అని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా వేటకు వెళ్లి మృతి చెందిన 18 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.90 లక్షల బీమా చెక్కులను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, మత్స్యకార ప్రతినిధులు పాల్గొన్నారు.
