కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్ష నిర్వహించారు. బాలిక ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు దర్యాప్తు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం కొనసాగుతున్న శోధన చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపులో పాల్గొంటున్నప్పటికీ, అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు.
దట్టమైన అటవీ ప్రాంతాల్లో గాలింపు మరింత విస్తృతంగా నిర్వహించాలని, అటవీశాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్తో పాటు నిపుణుల సహకారాన్ని కూడా తీసుకోవాలని ఆయన తెలిపారు. చిన్నారి అదృశ్యమైన ప్రాంతం పరిసరాల్లోని అడవులను పూర్తిస్థాయిలో జల్లెడ పట్టాలని సూచించారు.
దర్యాప్తు పురోగతిపై వివరించిన కాకినాడ ఎస్పీ, ప్రస్తుతం 400 మందికిపైగా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. అత్యాధునిక డ్రోన్ల సాయంతో విస్తృతంగా శోధన కొనసాగుతోందని, చిన్నారి ఇంటి పరిసరాల్లో ఉన్న 38 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలించినట్లు వెల్లడించారు.
వారం రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించి బాలికను క్షేమంగా గుర్తించేందుకు చర్యలు మరింత ముమ్మరం చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
