పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా చూపించిన తెలుగు భాషాభిమానం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఆకట్టుకుంది.
చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన, తెలుగు నేర్చుకోవడంపై కలెక్టర్గారి కృషిని హృదయపూర్వకంగా ప్రశంసించారు. కృతికా శుక్లా తెలుగు మాట్లాడుతున్న తీరు చూసి “మీరు ఇక్కడే పుట్టారా?” అని ఆశ్చర్యంతో అడిగానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
మొదట ఆమె గుంటూరు లేదా విజయవాడ ప్రాంతానికి చెందినవారేమో అనుకున్నానని, కానీ ఆమె “మాది హర్యానా” అని చెప్పడంతో మరింత ఆశ్చర్యపోయానని చెప్పారు. మన మాతృభాష నేర్చుకోవడంలో మనమే కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటే, హర్యానా నుంచి వచ్చిన ఆమె స్వయంగా తెలుగు నేర్చుకుని చక్కగా మాట్లాడడం నిజంగా ఆదర్శమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
తెలుగు పట్ల ఆమె చూపుతున్న ప్రేమ, పిల్లలకు భాషను అర్థమయ్యేలా చేసేందుకు తీసుకుంటున్న శ్రమ ఎంతో గొప్పదని ఆయన అభినందించారు. ఇతర ప్రాంతాల వారికి తెలుగు భాషపై ఉన్న గౌరవాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఈ వ్యాఖ్యలు సామాజిక వేదికలలో విస్తృతంగా చర్చకు దారితీశాయి.
