ఆంధ్రప్రదేశ్ గ్రామాల సమగ్రాభివృద్ధికి పారదర్శక సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి Pawan Kalyan అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు, అవసరమైన వసతులు, పంచాయతీ భూములు, పోరంబోకు స్థలాలు, పశువుల మేత మైదానాలు, స్మశానవాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ సర్వే ఆధారంగా గ్రామాలకు భూసంరక్షణ కల్పించడంతో పాటు స్వయం సమృద్ధి సాధించేలా కొత్త ఆదాయ వనరులను సృష్టించవచ్చని ఆయన తెలిపారు.
మంగళవారం క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధిపై కీలక ఆదేశాలు జారీ చేశారు. పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు.
పల్లె పండుగ తొలి విడతలో లక్ష్యంగా పెట్టుకున్న 4 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయిందని, రెండో విడతలో 2,750 కిలోమీటర్ల లక్ష్యానికి మించి 3,580 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. గోకులాలు, ఫార్మ్ పాండ్స్, పశువుల నీటి తొట్టెల నిర్మాణంలో కూడా ప్రభుత్వం లక్ష్యాలను అధిగమించిందని వెల్లడించారు. ముఖ్యంగా రెండో విడతలో 81 వేల ఫార్మ్ పాండ్స్ లక్ష్యానికి గానూ 86 వేల కుంటలు తవ్వించినట్లు చెప్పారు.
గ్రామాల్లో మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మ్యాజిక్ డ్రెయిన్స్ వ్యవస్థను మరింత విస్తరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. డెల్టా ప్రాంతాలు, నల్లరేగడి నేలలు, మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా ఈ డ్రెయినేజ్ విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. పనులు శాస్త్రీయంగా, దీర్ఘకాలం మన్నేలా ఉండేందుకు ఇంజనీర్లు, ప్రజారోగ్య నిపుణుల సలహాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
గ్రామీణ రహదారుల నాణ్యతపై రాజీ పడొద్దని ఆయన హెచ్చరించారు. సీసీ రోడ్లు వేసిన తర్వాత పక్కలా మట్టితో వాలు చేయకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రోడ్ల పనుల్లో పారదర్శకత కోసం జియో మానిటరింగ్ సిస్టమ్ తీసుకొచ్చినట్లు వెల్లడించారు. జియో ట్యాగింగ్, శాటిలైట్ సాంకేతికత ద్వారా ఏ గ్రామంలో ఎంత మేర పనులు జరిగాయో ఖచ్చితంగా గుర్తించవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా డూప్లికేట్ పనులకు చెక్ పడటంతో పాటు ప్రజలు కూడా రోడ్ల స్థితిని ఆన్లైన్లో తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.
ఉపాధి హామీ నిధులను ప్రభుత్వం నిర్దేశించిన పరిమితుల్లోనే వినియోగించాలని, అనుమతించిన పనులను మాత్రమే చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడితే ఆడిట్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు.
