పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో దూకుడు పెంచేందుకు సిద్ధం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సాక్షిగా పవన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అధికారంలో ఉన్న వైకాపాకు చెక్ పెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంలో పవన్ కళ్యాణ్ కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అమరావతి రైతులకు అండగా నిలిచేందుకు పవన్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని చెప్పిన పవన్, దానిని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఎవరెంతగా అడ్డుపడినా సరే అమరావతి విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పిన పవన్, దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు. ఈనెల 20 వ తేదీన రైతులు ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీనికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అంతేకాదు, రాజధానిని ఇంచే కూడా కదిపేందుకు ఒప్పుకోమని ఇప్పటికే అన్ని పార్టీలు స్ఫష్టం చేశాయి. నవంబర్ 3 వ తేదీన జనసేన పార్టీ విశాఖలో లాంగ్ మార్చ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు అదే విధంగా అమరావతి కోసం విజయవాడలో పవన్ లాంగ్ మార్చ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. విశాఖలో జరిగిన లాంగ్ మార్చ్ కు తెలుగుదేశం సపోర్ట్ చేసింది. అయితే, ఇప్పుడు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.
అంతేకాదు, తెలుగుదేశం పార్టీతో పాటుగా లెఫ్ట్ పార్టీలు పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కానీ, జనసేన మాత్రం పౌరసత్వ చట్టానికి సంపూర్ణ మద్దతు ఇచ్చింది. చట్టాన్ని సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నాయని పవన్ ప్రతిపక్ష పార్టీలను విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు వలన మైనారిటీలకు ఎలాంటి ఇబ్బందులు లేవని కేంద్రం చెప్తున్నా, పార్టీలు తమ రాజకీయ మనుగడ కోసమే వ్యతిరేకిస్తున్నామని పవన్ పేర్కొన్నారు. పవన్ ఈ చట్టాన్ని తన భుజాలపై వేసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ విషయంలో ప్రజలను కన్విన్స్ చేయగలిగితే పవన్ రాజకీయనాయకుడిగా సక్సెస్ అయినట్టే అని చెప్పొచ్చు.