ఆపరేషన్ సిందూర్ ఆపొద్దని.. ఉగ్రవాదాన్ని సమూలంగా ఏరిపారేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ పై ఆయన స్పందించారు. ఇది దేశం గర్వించదగ్గ సమయమని.. పహల్గాంలో 26 మందిని అత్యంత క్రూరంగా చంపినందుకు.. న్యాయం జరిగిందన్నారు. ఈ విషయంలో ఆర్మీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. దేశమంతా వారి వెంటే ఉంటుందని స్పష్టం చేశారు. “ఇది దేశ సమైక్యతను చాటే సమయం. ఈ సమయంలో పౌరులందరూ ఒకే తాటిపైకి వచ్చి మన సైనికులకు మద్దతు తెలపాలి. ఆపరేషన్ సిందూర్ తో భారత్ ఆర్మీ సత్తా ఏంటో ప్రపంచం చూసింది. పాకిస్తాన్ లోపలికి 200 కిలోమీటర్ల వరకు వెళ్లి ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడం అంటే.. అది కేవలం ఇండియన్ ఆర్మీకే సాధ్యమైంది. ఇన్ని రోజులు మనకు సహనం ఎక్కువైంది.. మనకు కోపం వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రపంచం చూస్తోంది.
ప్రతిసారి సహనం సహనం అంటూ ఓపిక పట్టాo. కానీ భారత మహిళల ముందే వాళ్ల భర్తలను చంపుతుంటే చూస్తూ ఊరుకుంటామా.. ఇప్పుడు పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం చూపించాలి. ఇన్ని రోజులు ఏం జరిగినా.. ఇలాంటి ఉగ్రవాదం మన మీద పడ్డా.. ఓపికతో కూర్చున్నాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ తో పాటు ఉగ్రవాదానికి మన సత్తా ఏంటో చూపించాల్సిన టైం వచ్చింది. ఈ విషయంలో ఆర్మీ ఎంత ముందుకు వెళ్లినా మనం అండగానే ఉండాలి. సరైన టైంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో దేశమంతా ఆయన వెంటే ఉండాలి. పాకిస్తాన్ సైనికుల జోలికి వెళ్లకుండా టెర్రరిస్టులను మట్టు పెట్టడంలో ప్రధానమంత్రి సక్సెస్ అయ్యారు.
ఈ విషయంలో సెలబ్రిటీలు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఎక్కడ జాతీయ వ్యతిరేక కార్యకలాపాలకు పాటు పడవద్దు. ఎలాంటి ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేయొద్దు. దేశ సమగ్రతకు భంగం వాటిల్లేలా ప్రవర్తించొద్దు. ఆంధ్రప్రదేశ్ కు కూడా 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ప్రమాదం ఎటువైపు నుంచి వచ్చినా.. ఎదుర్కోవడానికి మన నేవీ సిద్ధంగా ఉంది. ఇలాంటి టైం లో సైన్యమే కాకుండా మనమందరం జాగ్రత్తగా ఉండాలి” అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
