మంగళగిరి క్యాంపు కార్యాలయంలో భారత మహిళల అంధుల క్రికెట్ ప్రపంచకప్ విజేత జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా సత్కరించారు. క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బంది అందరితో ఆయన ప్రత్యేకంగా సమావేశమై వారి అసాధారణ విజయాన్ని అభినందించారు. ప్రపంచ కప్ గెలుచుకుని దేశానికి గౌరవం తీసుకువచ్చిన ఈ జట్టును చూసి గర్వపడుతున్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఒక్కో మహిళా క్రికెటర్కు రూ.5 లక్షల చొప్పున, శిక్షకులకు రూ.2 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. అదనంగా ప్రతి క్రికెటర్కు పట్టు చీర, శాలువా, జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించడం విశేషం. అంధ క్రికెటర్ల సాధన దేశానికి ప్రేరణగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.
అంధ క్రికెట్ ప్రాక్టీస్ కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు పూర్తి సహకారం అందిస్తోందని, మహిళా క్రికెటర్లు చెప్పిన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని వెల్లడించారు.
ప్రపంచకప్ విజేత జట్టులో ఆంధ్రప్రదేశ్కు చెందిన కెప్టెన్ దీపిక, పాంగి కరుణా కుమారి ఉండటం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా దీపిక తన గ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా హేమావతి పంచాయతీలోని తంబలహట్టి తండాకు రహదారి సౌకర్యం లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నట్లు తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్, అవసరమైన చర్యలు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అలానే అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన క్రీడాకారిణి కరుణకుమారి చేసిన విజ్ఞప్తులపైనా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుకు లభించిన ఈ గౌరవం క్రీడా రంగానికి, ముఖ్యంగా అంధ క్రీడాకారిణులకు మరింత ఉత్సాహాన్ని నింపేలా ఉందని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.
