71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినీ పరిశ్రమకు పలు అవార్డులు రావడం ఆనందదాయకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం గర్వకారణమని ఆయన అభినందనలు తెలిపారు. ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్దిలకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ (వి.ఎఫ్.ఎక్స్.) విభాగంలో విజయం సాధించిన హను-మాన్ చిత్ర బృందానికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, వి.ఎఫ్.ఎక్స్. నిపుణులు, నిర్మాతల కృషిని ప్రశంసించారు. బేబీ చిత్రానికి స్క్రీన్ప్లే రాసిన నీలం సాయి రాజేష్, బలగం చిత్రానికి గీతాలు రాసిన కాసర్ల శ్యామ్, బేబీ చిత్రంలో గాయకుడు పి.వి.ఎన్.ఎస్. రోహిత్, హను-మాన్ చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫర్ నందు పృథ్వీ, గాంధీ తాత చెట్టు చిత్రంలోని బాలనటి సుకృతివేణి బండ్రెడ్డి విజయాలను ఆయన అభినందించారు.
అలాగే జాతీయ స్థాయిలో ఉత్తమ నటులుగా షారుక్ ఖాన్, విక్రాంత్ మాస్సే, ఉత్తమ నటి రాణీ ముఖర్జీ, ఉత్తమ దర్శకుడు సుదీప్తో సేన్ సహా అన్ని విజేతలకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయాలు సినీ పరిశ్రమకు నూతనోత్సాహాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు.
