పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనులు, వాటి పురోగతి, రోడ్ల ప్రస్తుత పరిస్థితి వంటి వివరాలు ప్రజలకు నేరుగా తెలిసేలా ప్రత్యేక పబ్లిక్ డ్యాష్బోర్డ్ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు కీలక సూచనలు చేశారు.
స్థానిక సంస్థలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు పూర్తి సమాచారం ఉండాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లు ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా జరిగాయని ఆయన అభినందించారు. పంచాయతీలు తమ ఆదాయ వనరులను మరింత పెంచుకునేలా సమష్టి కృషి కొనసాగించాలని సూచించారు.
ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా అమలు చేస్తున్న స్వచ్ఛ రథాల విధానం మంచి ఫలితాలు ఇస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా పొడి వ్యర్థాలను ఇచ్చి, అవసరమైన వస్తువులు తీసుకెళ్తున్న తీరు ప్రోత్సాహకరంగా ఉందన్నారు. ఈ విధానాన్ని ప్రతి నియోజకవర్గంలో విస్తరించడంతో పాటు, తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన గ్రీన్ షాప్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
ఏప్రిల్ నెలలో స్వచ్ఛ రథాల ద్వారా 18.86 లక్షల కేజీల వ్యర్థాలను సేకరించామని, వాటి విలువ సుమారు రూ.3 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. గ్రీన్ షాపుల్లో పొడి వ్యర్థాలు ఇచ్చి నిత్యావసరాలు తీసుకెళ్లే విధానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, తద్వారా పరిశుభ్రతపై చైతన్యం పెంపొందించాలని సూచించారు.
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులు నాణ్యతతో పాటు నిర్దిష్ట గడువులో పూర్తయ్యేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రతి రోడ్డు పనికి ముందుగానే పూర్తి చేసే సమయాన్ని నిర్ణయించాలని, ప్రజల వినతుల ఆధారంగా చేపడుతున్న పనుల్లో పూర్తి జవాబుదారీతనం కనిపించాలన్నారు. రోడ్ల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఉన్నతాధికారులు తరచూ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించాలని సూచించారు.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.
