Pawan Kalyan-Lokesh: హైదరాబాద్ నగరం చార్మినార్ ప్రాంతంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఈరోజు ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దుర్ఘటనలో 17 మంది మృతి చెందడం.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, 4గురు మహిళలు ఉండటం కలచి వేస్తోంది. ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్.. ‘గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాద ఘటన దిగ్భ్రాంతికరం. దుర్ఘటనలో 17మంది మృతి చెందడం బాధాకరం. బాధిత కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. మృతుల కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని.. క్షతగాత్రులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నా’నని అన్నారు.
లోకేశ్.. హైదరాబాద్ లోని చార్మినార్ పరిధి గుల్జార్ హౌస్ లో అగ్నిప్రమాదం జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మంటల్లో చిన్నారులు, మహిళలతోసహా పలువురు మరణించడం విషాదకరం. కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నా. మృతుల కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’నని అన్నారు.
