Pawan Kalyan: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన 17ఏళ్ల నిరంజన్ ను నేటి ఉదయం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలుసుకున్న సంగతి తెలిసిందే. జన్యుసంబంధమైన వ్యాధితో బాధపడుతూ తన చిరకాల కోరిక పవన్ కల్యాణ్ ను కలవాలనుందని నిరంజన్ చెప్పాడు. విషయం పవన్ కల్యాణ్ వరకూ చేరడంతో ఈరోజు బాలుడిని కలిసి నిరంజన్ కోరికను నెరవేర్చారు. బాలుడితో ముచ్చటించి ఆ కుటుంబం ఇంట ఆనందాన్ని కలిగించారు. ఈక్రమంలో పవన్ తన ఎక్స్ పోస్ట్ ద్వారా బాలుడి ధైర్యాన్ని కొనియాడారు.
‘నిరంజన్ అరుదైన వ్యాధితో బాధపడుతూ నన్ను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేయడం.. అది నావరకూ రావడం జరిగింది. అందుకే నిరంజన్ ను కలిసుకుని అతని కోరిక నెరవేర్చాలని భావించి వెళ్లి పరామర్శించాను. అరుదైన వ్యాధితో పోరాడుతున్నా అతను చూపుతున్న అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, క్లిష్టపరిస్థితులు ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకం. అతని మనోధైర్యం ప్రశంసనీయం. నిరంజన్ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో, ఉత్సాహంతో అందరి ముందుకూ రావాలని కోరుకుంటున్నా’నని తెలిపారు.
ఈక్రమంలో తనకు రామ్ చరణ్ దగ్గర ఉన్న లాంటి కుక్కపిల్లను పెంచుకోవాలనుందని పవన్ కు చెప్పాడు. దీంతో చరణ్ దగ్గర రెండు, మూడు రకాలున్నాయి. ఏదో కనుక్కుని ఓ కుక్కపిల్ల కొనిస్తానని నిరంజన్ కు హామీ ఇచ్చారు. మరోవైపు.. ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ సైతం నిరంజన్ కుటుంబానికి ఆర్ధిక సాయం ప్రకటించారు. ‘పవన్ కల్యాణ్ గారిని కలవాలనే ఆ బాలుడి ఆకాంక్ష నేడు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. పవన్ కల్యాణ్ గారి భక్తుడిగా ఆయన స్ఫూర్తితో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరపున అతని కుటుంబానికి రూ.5లక్షలు ఆర్ధిక సాయం ప్రకటిస్తున్నా’నని ఎక్స్ వేదికగా ప్రకటించారు.
