ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన యువకులు మోసపోయి మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో బందీలయ్యారని విజయనగరం జిల్లా మహిళ గండబోయిన సూర్యకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ను కలసి, తన ఇద్దరు కుమారులతోపాటు 8 మంది మయన్మార్ సరిహద్దుల్లో చిక్కుకున్నారని వివరించారు.
వారి ప్రాణాలకు ముప్పు ఉందని, వెంటనే రక్షించాలంటూ ఆమె పవన్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయంపై స్పందించిన పవన్ కళ్యాణ్ గారు, మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో ఉన్న యువకులను కాపాడాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై విదేశీ వ్యవహారాల శాఖ సానుకూలంగా స్పందించి, వారు తిరిగి వస్తారనే ఆశ కలిగేలా హామీ ఇచ్చినట్లు సమాచారం.
