మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. అమరావతి, సీఆర్డీఏ పరిధి, మావిగన్ ప్రతిపాదన, అభివృద్ధి అంశాలపై మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం జగన్ నుంచి అభివృద్ధి పాఠాలు నేర్చుకునే పరిస్థితిలో లేదని స్పష్టం చేశారు. సీఆర్డీఏ పరిధిని తెలిపే మ్యాప్ ఒక్కసారి చూసినా చంద్రబాబు విజన్ ఏంటో స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు.
పట్టాభి రామ్ మాట్లాడుతూ, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధి కోసం 2015లోనే స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. 2015 సెప్టెంబర్ 22న జీవో నెంబర్ 207 ద్వారా సీఆర్డీఏను ఏర్పాటు చేసి, రాజధాని అభివృద్ధితో పాటు పరిసర ప్రాంతాల సమగ్ర వృద్ధికి పునాది వేసినట్టు వివరించారు. సీఆర్డీఏ అనేది కేవలం అమరావతి నగరానికి మాత్రమే పరిమితం కాదని, దాని పరిధిలో విజయవాడ, గుంటూరు, తెనాలి వంటి నగరాలు, అనేక మున్సిపాలిటీలు, గ్రామీణ మండలాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు.
మచిలీపట్నం సమీపంలోని మోపిదేవి, ఘంటశాల, చల్లపల్లి నుంచి మొదలుకొని పామర్రు, గుడివాడ, నూజివీడు, మైలవరం, కొండపల్లి, జగ్గయ్యపేట వరకు, మరోవైపు గుంటూరు దాటి ఎడ్లపాడు, ఫిరంగిపురం వరకు విస్తరించిన భారీ ప్రాంతం సీఆర్డీఏ పరిధిలోకి వస్తుందని ఆయన తెలిపారు. దాదాపు 8,350 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక సమగ్ర అభివృద్ధి కారిడార్గా అప్పుడే చంద్రబాబు రూపకల్పన చేశారని చెప్పారు. ఈ వాస్తవాలు తెలియకుండానే జగన్ “మావిగన్” అనే పేరుతో కొత్త చర్చ మొదలుపెట్టారని ఆయన విమర్శించారు.
సీఆర్డీఏ అంటే కేవలం అమరావతి రాజధాని నిర్మాణమే కాదని, కోర్ రీజియన్, ఎక్స్టెండెడ్ రీజియన్, పెరిఫెరల్ ఎక్స్టెండెడ్ రీజియన్ల రూపంలో విస్తరించిన ప్రాంతీయ అభివృద్ధి మోడల్ అని పట్టాభి వివరించారు. ఉయ్యూరు, నూజివీడు, పొన్నూరు వంటి ప్రాంతాలు కూడా ఈ అభివృద్ధి ప్రణాళికలో భాగమని చెప్పారు. దీంతో అమరావతి అభివృద్ధి చెందితే దాని చుట్టూ ఉన్న అనేక పట్టణాలు, మండలాలు, గ్రామాలకు కూడా మౌలిక సదుపాయాలు, రోడ్లు, ఉపాధి, పెట్టుబడులు చేరుతాయని పేర్కొన్నారు.
అయితే, నేడు మావిగన్ ప్రతిపాదనపై ప్రేమ చూపిస్తున్న జగన్, 2020లో అదే పరిధిలో ఉన్న ఏపీ సీఆర్డీఏ యాక్ట్ను ఎందుకు రద్దు చేయాలని చూశారని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో ఈ ప్రాంత అభివృద్ధి గుర్తుకు రాలేదా అని నిలదీశారు. మూడు రాజధానుల అంశాన్ని ముందుకు తెచ్చి అమరావతిని బలహీనపరిచేందుకు ప్రయత్నించారని, కానీ హైకోర్టు జోక్యంతో వెనక్కి తగ్గాల్సి వచ్చిందని గుర్తు చేశారు.
పట్టాభి అభిప్రాయం ప్రకారం, హైదరాబాద్ అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్ ఎలా కీలకమైందో, అలాగే అమరావతి చుట్టూ కూడా ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఇతర మౌలిక సదుపాయాల ద్వారా మొత్తం సీఆర్డీఏ ప్రాంతం అభివృద్ధి చెందేలా ప్రణాళికలు అమలవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
ఉత్తరాంధ్రలో ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థల పెట్టుబడులు రావడం ద్వారా భారీ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. రాయలసీమలో రెన్యూవబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్ రంగాల్లో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయని, కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటవుతుందని అన్నారు. ఈ అన్ని చర్యలు చూస్తే రాష్ట్ర అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ దృష్టి ఎంత స్పష్టంగా ఉందో తెలుస్తుందని పేర్కొన్నారు.
అమరావతి అంశంలో “బిల్లు” మరియు “తీర్మానం” మధ్య తేడా కూడా వైసీపీ శ్రేణులు అర్థం చేసుకోవడం లేదని పట్టాభి విమర్శించారు. అసెంబ్లీలో చేసినది కేవలం ఒక తీర్మానం మాత్రమేనని, అది చట్టం కాదని వివరించారు. చట్టబద్ధత రావాలంటే కేంద్రం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి, లోక్సభ, రాజ్యసభల ఆమోదం పొందాల్సి ఉంటుందని చెప్పారు. అమరావతి రాజధానిగా చట్టబద్ధత పొందడానికి అవసరమైన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ (అమెండ్మెంట్) బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందిందని తెలిపారు.
ఇలాంటి ప్రాథమిక వ్యత్యాసం కూడా తెలియకుండా జగన్, ఆయన అనుచరులు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పట్టాభి అన్నారు. తీర్మానం అనేది అభిప్రాయం వ్యక్తీకరణ మాత్రమే, బిల్లు అనేది చట్టంగా మారే ప్రక్రియలో భాగమని ఆయన వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు స్పష్టంగా తెలుసుకోవాలని సూచించారు.
మావిగన్ పేరును ప్రతిపాదించడం ద్వారా జగన్ ఇప్పుడు రాజకీయంగా కామెడీ పీస్గా మారిపోయారని పట్టాభి వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ శక్తులు అమరావతికి మద్దతు ఇస్తున్న సమయంలో జగన్ మాత్రమే వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారని అన్నారు. పార్లమెంట్లో అమరావతి అంశం వచ్చినప్పుడు వైసీపీ వాకౌట్ చేయడం ద్వారా ఆ పార్టీ అసలు ఉద్దేశం బయటపడిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు ఒక్కొక్కటిగా ముందుకు వెళ్తున్నాయని పట్టాభి చెప్పారు. అమరావతి నిర్మాణం ఎంత వేగంగా సాగితే, జగన్ రాజకీయంగా అంత వెనుకబడతారని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు ఇక ఫలించవని, అది ఇప్పుడు “అన్స్టాపబుల్” దిశగా సాగుతోందని వ్యాఖ్యానించారు.
ప్రతి నెల అమరావతి పనులపై సమీక్షలు నిర్వహిస్తూ, రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందని చెప్పారు. త్వరలోనే ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలు రాష్ట్ర ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచాయని పట్టాభి రామ్ అన్నారు.
