Orissa Train Accident: ఒడిశా లోని బాలేశ్వర్ లో జరిగిన రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. ఇప్పటికి కొంతమంది మృతదేహాలను గుర్తు పట్టలేదు. మృతుల వివరాలను సేకరించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీన్ని కొందరు అవకాశంగా తీసుకుంటున్నారు. ఈ పరిస్థితిని అదునుగా తీసుకొని ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని కొట్టేయాలని చూస్తున్నారు. అలా ఓ మహిళ తన భర్త బతికుండగానే చనిపోయాడని నమ్మబలికి ప్రభుత్వం నుంచి పరిహారాన్ని పొందాలని చూసింది. అధికారులు అప్రమత్తం కావడంతో ఆమె బండారం బయటపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే…
కటక్ కి చెందిన గీతాంజలి దత్తా అనే మహిళ ప్రమాదం జరిగిన రైల్లో తన భర్త ఉన్నాడని, అతని ఆచూకీ తెలియడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాల ఫోటోలు ఉన్న ప్రదేశానికి ఆమెను తీసుకెళ్లారు. అక్కడే ఉన్న ఒక ఫోటోని చూపిస్తూ ఆ వ్యక్తి తన భర్త అని పోలీసులను నమ్మించింది. ఆమె ప్రవర్తన పై పోలీసులకు అనుమానం వచ్చి ఆమె చెప్పిన అడ్రస్ ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్లో విచారించారు. గీతాంజలి భర్త బతికే ఉన్నాడని అక్కడి పోలీసులు తేల్చారు. దీంతో ఆమెని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా… పరిహారం కోసమే నాటకమాడినట్లు తెలిపింది. దీంతో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు. అవకాశాన్ని అదునుగా తీసుకొని మోసపూరిత చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది.