YS Avinash Reddy:కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి డైరీలో.. మరో రోజు, ఎలాంటి విశేషమూ లేకుండా పోయింది. న్యాయస్థానంలో వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై వాదనలు కొన‘సాగు’తూనే వున్నాయి.! విచారణ రేపటికి వాయిదా పడింది.
ఇంకోపక్క, అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మి కోలుకుంటున్నారట. ఆమెను హైద్రాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారట. కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి నుంచి హైద్రాబాద్కి ఆమె తరలింపుపై సమాచారం అందగానే, ‘అంటే అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చేస్తుందన్నమాట..’ అనే చర్చ వైసీపీ వర్గాల్లో జరిగింది.
చిత్రంగా, ఈసారి అవినాశ్ రెడ్డి తండ్రికి స్వల్ప అనారోగ్యం సంభవించింది. అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని గతంలోనే సీబీఐ అరెస్టు చేసింది. అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఆయన్ని ఆసుపత్రికి తరలించారట.
‘సో, రేపట్నుంచి హైద్రాబాద్కి టెంట్లు.. కార్లు.. కూలర్లు.. వాటితోపాటుగా జనాల్ని తరలిస్తారన్నమాట..’ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంత కామెడీగా మారిపోవడం శోచనీయమే. ఈ రోజు టర్నింగ్ పాయింట్ ఏంటంట, అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా, సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు ప్రస్తావనకు రావడం.
‘సమాచారం ముందే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిసింది’ అని పేర్కొంది సీబీఐ, తన అఫిడవిట్లో. దాని గురించి అవినాశ్ రెడ్డిని ఆరా తీయాల్సి వుందట. ట్విస్టు అదుర్స్ కదా.!