జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సమధికోత్సాహంతో ప్రారంభమైంది. మహాశివరాత్రి పర్వదినాన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. సభ్యత్వ నమోదు సందర్భంగా పవన్ కళ్యాణ్ రూ.2 కోట్లు విరాళంగా అందించి స్వయంగా ‘ఉద్యమి’ సభ్యత్వాన్ని స్వీకరించడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఇప్పటికే ఈ నెల 19న పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభమైన నమోదు ప్రక్రియను గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు మొత్తం అయిదు రాష్ట్రాల్లో సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచే వేలాది మంది సాధకులు సభ్యత్వ నమోదు ప్రక్రియలో పాల్గొన్నారు. తొలి రోజే లక్ష మంది ‘ఉద్యమి’ సభ్యత్వం స్వీకరించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలోని కృష్ణలంక ప్రాంతంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా పలువురు ‘ఉద్యమి’ సభ్యత్వం తీసుకున్నారు. కార్యక్రమ నిర్వహణపై పార్టీ నాయకులతో చర్చించి మార్గదర్శకాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. నిడదవోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు.
అదేవిధంగా 25 నియోజకవర్గాల పార్లమెంట్ కోఆర్డినేటర్లు తమకు కేటాయించిన ప్రాంతాల్లో పర్యటించి సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. గురువారం సాయంత్రం నాదెండ్ల మనోహర్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తొలి రోజు నమోదు పురోగతిపై సమీక్ష చేశారు. ఈ సమీక్షలో పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి, ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, ఐటీ సెల్ ఛైర్మన్ శ్రీనివాస్ మిరియాల పాల్గొన్నారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి విడుదలైన సమాచారం ప్రకారం, ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత వేగవంతం చేసి, లక్షలాది మంది యువతను, మహిళలను, సామాజిక వర్గాలను కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో పార్టీ ముందడుగు వేస్తోంది. తొలి రోజే లక్ష సభ్యత్వాల నమోదు పార్టీకి బలమైన ఆరంభంగా మారిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

