ప్రభుత్వ విద్యను దేశంలో ఆదర్శంగా నిలిపేందుకు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను కలిశారు.
ఈ సందర్భంగా ఎంఈవో పోస్టుల్లో జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలంటూ, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలంటూ వారు వినతిపత్రం సమర్పించారు. అలాగే ఇటీవల ఉపాధ్యాయుల బదిలీలు రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా జరిగాయని, కొత్తగా మోడల్ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు ఉపాధ్యాయుల్లో ఉత్సాహాన్ని కలిగించిందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
నారా లోకేష్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను చర్చల ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇకపై జిల్లావారీ క్లస్టర్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరవుతానని తెలిపారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలతో పాటు నైతిక విలువలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, అంకితభావంతో పని చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోండూరు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి బొనిగెల హైమారావు, రాష్ట్ర క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ చెరుకూరి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి జె. శ్రీనివాసరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎమ్.రెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
