Sai Pallavi: తన అందం, అభినయం, డాన్స్ తో తొలి తెలుగు చిత్రం ‘ఫిదా’ తోనే ఆకట్టుకుంది సాయి పల్లవి( Sai Pallavi). ఆ సినిమాలో ‘ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల’ అంటూ ఆమె చేసిన సందడి అంతా కాదు. మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది. అయితే సినిమా ఎంపికలో ఈమె ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటుంది. కథ మాత్రమే కాదు అందులో తన పాత్ర కూడా నచ్చితేనే ఆ సినిమాకి ఓకే చెప్తుంది.
సాయి పల్లవి తెలుగులో చేసిన ఆఖరి చిత్రం ‘విరాటపర్వం’ గతేడాది ఇదే నెలలో విడుదలైన ఈ సినిమాలో ఆమె నటన కి విమర్శకులు ప్రశంసలు అందాయి. సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్ అయినప్పటికీ ఆ సినిమాలోని ‘వెన్నెల’ పాత్రకు సాయి పల్లవి ప్రాణం పోసింది. ఆ తర్వాత అనువాద చిత్రం ‘గార్గి’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
గత కొంతకాలంగా సాయి పల్లవి నుంచి కొత్త సినిమా కబురేది అందలేదు. దీంతో ఈమెపై రకరకాల రూమర్స్ హల్చల్ చేశాయి. నటనకు గుడ్ బై చెబుతుందని, ఎలాగో డాక్టర్ కాబట్టి వైద్య వృత్తిలో కొనసాగుతుందని వార్తలు వచ్చాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ ఇటీవలే తమిళ హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగులో మాత్రం ఇంతవరకు ఏ సినిమా ప్రకటించలేదు. దీంతో ఆమెకి నచ్చిన కథలు టాలీవుడ్ లో రావడం లేదా? ఎందుకు గ్యాప్ ఇచ్చింది? తిరిగి తెలుగు తెరపై ఎప్పుడు కనిపిస్తుంది? అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే సాయి పల్లవి స్పందించాలి.