ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు.
ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ నిమ్మల, “ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో జగన్ వ్యవహరిస్తున్నారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంపేస్తాం, నరుకుతాం, అంతం చేస్తాం అనే భయానక సిద్ధాంతంతో వైసీపీ రాజకీయాలు చేస్తున్నదని అన్నారు.
వైసీపీ అధికారంలోకి వస్తే పనులు నిలిపివేయడం, నిర్మాణాలను పడగొట్టడం, యువతను చెడగొట్టడం, డ్రగ్స్ ప్రోత్సహించడం, మహిళలను గెంటేయడం వంటి విధానాలతో ముందుకు వెళ్తుందని నిమ్మల ఆరోపించారు. మహిళలు, యువత కోసం ప్రకటిస్తున్న పాలసీలు విధ్వంసకరంగా ఉన్నాయని విమర్శించారు.
రాజకీయాలకు అడ్డొస్తే బంధుత్వం కూడా చూడకుండా వ్యవహరించే పార్టీ వైసీపీ అని, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను ప్రస్తావిస్తూ ప్రశ్నలు సంధించారు. గొడ్డలిపోటుతో జరిగిన మరణాన్ని గుండెపోటుగా ఎందుకు చెప్పారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే పరిటాల రవి, వివేకా హత్య కేసులకు సంబంధించిన సాక్షులు, నిందితులు అనుమానాస్పదంగా మరణించడం వెనుక కారణాలు ఏమిటో వెల్లడించాలని కోరారు.
గుంటూరు ప్రాంతంలో ప్రజలను ఇళ్ల నుంచి లాగి బయటకు తీస్తామని, ఇళ్లలోకి వెళ్లి చంపుతామని వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని నిమ్మల ఆరోపించారు. మీడియాపై కూడా ఒత్తిడి తెస్తున్నారని, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి వంటి పత్రికలను మూసివేస్తామని బెదిరించడం ఫోర్త్ ఎస్టేట్కు ముప్పని అన్నారు.
అలాగే వంగవీటి రంగా హత్య అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆ ఘటనకు సంబంధించిన కుటుంబాలు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాయో ప్రశ్నించారు. రంగా గురించి విమర్శలు చేసిన గౌతమ్ రెడ్డి కు జగన్ పదవి ఇవ్వడం ఎందుకని నిలదీశారు. రంగా హత్యకు సంబంధం ఉన్న కుటుంబాలకు హైదరాబాద్లో భారీ ఆస్తులు కల్పించిందీ వైఎస్ రాజశేఖర రెడ్డి కాదా అని ప్రశ్నించారు.
కాపు సమాజం, వంగవీటి రంగా అంశాలపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని నిమ్మల స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలు వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసినా కూడా ఆ పార్టీ సిగ్గు పడటం లేదని విమర్శించారు.
మొత్తానికి, “గొడ్డలి రాజకీయాలు చేసే పార్టీకీ ప్రజలు రాజకీయ సమాధి కట్టాలి” అంటూ నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు.
