రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కొనసాగించాల్సిందేనని ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే తాను చార్జి తీసుకుంటున్నట్టు నిమ్మగడ్డ ప్రకటించారు. ఆ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో తీర్పు వెలువడగా.. నిమిషాల వ్యవధిలో తాను ఎస్ఈసీగా బాధ్యతలు తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. వెంటనే ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులకు ఆ మేరకు తెలియజేస్తూ ఉత్తర్వులు వెలువరించారు.
అయితే, శనివారం ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు శుక్రవారం నాటి ఆదేశాలు ఉపసంహరణలో ఉంటాయని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే తనకు తానుగా ఎస్ఈసీ చార్జి తీసుకుంటున్నట్టు ప్రకటించుకున్న 24 గంటలు గడిచేలోపే వెనక్కి తగ్గడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి కోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఆ తీర్పు పూర్తి పాఠం సంబంధిత వ్యక్తులకు చేరడానికి కొంత సమయం పడుతుంది. అందులో ఉన్న అంశాలను బట్టి ఇరు వర్గాలు తదుపరి ఏం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటాయి.
కానీ ఇక్కడ తీర్పు పాఠం రాకముందే నిమ్మగడ్డ కాస్త తొందరపడి తనంత తానుగా చార్జి తీసుకున్నారు. తీర్పు పూర్తి పాఠం తమకు అందగానే అడ్వొకేట్ జనరల్ కొన్ని సందేహాలు లేవనెత్తారు. నిమ్మగడ్డను చార్జి తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశించలేదని, అందువల్ల ఆయన తనకు తానుగా ఎస్ఈసీగా ప్రకటించుకోవడం హైకోర్టు తీర్పుకు విరుద్ధమని పేర్కొన్నారు.
అసలు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 1994 తర్వాత జరిగిన నియామకాలు ఏవీ కూడా చెల్లవని కొత్త పాయింటు లేవనెత్తారు. అంతేకాకుండా తాము ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నామని, అందుకు వీలుగా తీర్పు అమలుపై స్టే విధించాలని ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు చెప్పారు.
నిజానికి నిమ్మగడ్డను ఆ పోస్టు నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు వాటిని రద్దు చేస్తూ తిరిగి ఆయన్ను ఎస్ఈసీగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వమే ఆ మేరకు ఉత్తర్వులు వెలువరించాల్సి ఉంటుంది. కానీ సర్కారు ఉత్తర్వులు ఇవ్వకుండానే నిమ్మగడ్డ తనకు తానుగా ఎస్ఈసీగా ప్రకటించుకోవడం చెల్లదు. దీంతో ఈ మేరకు ఏజీ సందేహాలు వ్యక్తంచేసిన కొద్దిసేపటికే నిమ్మగడ్డ తన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు.